ఏపిలో రేషన్ కార్డు దారులకు మరల ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచిత బియ్యం పంపిణీకి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ నెల 19వ తేదీ నుండి ఈ ఉచిత బియ్యం పంపిణీ చేయనుంది. ఈ నెల నుండి మూడు నెలల పాటు ఉచిత బియ్యం రేషన్ షాపుల నుండి ఎన్ ఎఫ్ఎస్ఏ కార్డుదారులు పొందవచ్చు. నవంబర్, డిసెంబర్, జనవరి మూడు నెలల పాటు ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 19 వ తేదీ నుండి జరిగే బియ్యం పంపిణీకి సంబంధించి లబ్దిదారుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచడం జరుగుతుందని పౌర సరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ తెలిపారు. ఈ విషయాన్ని లబ్దిదారులు అందరూ తెలుసుకుని రేషన్ షాపుల ద్వారా ఉచిత బియ్యాన్ని పొందాలని, తెలియని వారికి ఈ విషయాన్ని చెప్పాలని ఆయన కోరారు.
అదే విదంగా ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారితనం పెంచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషన్ లబ్దిదారుల జాబితాను ప్రదర్సిస్తామని కమిషనర్ అరుణ్ కుమార్ తెలిపారు. ఇంతకు ముందు ఉచిత బియ్యాన్ని ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కూపన్ల ద్వారా పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) పథకం కింద మొత్తం రేషన్ కార్డు దారులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు. అయితే కేంద్రం 60 నుండి 65 శాతం కార్డులకు మాత్రమే ఉచిత రేషన్ ఇస్తుండటంతో ఏపిలో ఎన్ఎఫ్ఎస్ఏ కార్డుదారులకు మాత్రమే ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉచిత బియ్యం పొందే లబ్దిదారుల జాబితాను సిద్దం చేసింది.