IYR Krishna Rao: రాష్ట్రంలో కొద్ది రోజులుగా తీవ్ర విద్యుత్ కొరత నెలకొన్న సంగతి తెలిసిందే. అప్రకటిత విద్యుత్ కోతలు అమలు చేయడంతో ప్రజలు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. గృహ, వ్యవసాయ అవసరాలను ఇబ్బంది తగ్గించడం కోసం ప్రభుత్వం పరిశ్రమల విద్యుత్ వినియోగంపై ఆంక్షలు విధించింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆసుపత్రుల్లో పేషంట్స్ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సెల్ ఫోన్ లైట్ ల వెలుగులోకి ఆసుపత్రుల్లో గర్బిణిలకు వైద్యులు డెలివరీ చేసినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సమస్యలపై ఏపి మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ట్విట్టర్ వేదికగా స్పందించారు.
IYR Krishna Rao: ఈ సంక్షోభానికి జగన్ ప్రభుత్వానిదే బాధ్యత
ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితులపై గతంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడిన అంశాలను ప్రస్తావించారు ఐవీఆర్. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రా ప్రాంతంలో మిగులు విద్యుత్ ఉందనీ, తెలంగాణలో లోటు ఉందని, విభజన జరిగితే తెలంగాణ నష్టపోతుందని పేర్కొన్నారన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్లుగా విభజన జరిగిన కొత్తల్లో తెలంగాణ అలాగే విద్యుత్ సమస్యను ఎదుర్కొందన్నారు ఐవైఆర్. ఆనాడు మిగులుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రాంతం ఈ రోజు ఎక్కడలేని తీవ్ర విద్యుత్ సమస్య ఎదుర్కొంటోందని పేర్కొన్న ఐవైఆర్.. పాత ప్రభుత్వాన్ని ఎంత విమర్శించినా ఈనాటి విద్యుత్ సంక్షోబానికి వైఎస్ జగన్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. వీరి పాలన మూడేళ్లుగా సాగుతూనే ఉందని అన్నారు. సరైన ప్రణాళికతో ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేసి ఉంటే ఈనాడు ఇంత సంక్షోభం ఉండేది కాదని అన్నారు ఐవైఆర్.
పాలన ఈ విధంగా సాగినంత కాలం
“నెత్తిన మోయడానికి అలవి కాని మేనిఫెస్టోను పెట్టుకొని ఇక ఏ ప్రజా అవసరంతో మాకు పని లేదు. సంబంధం లేదు, అప్పులు తెచ్చి పంచడమే మా ప్రభుత్వ లక్ష్యం, తిరిగి గెలిస్తే అప్పుడు సంక్షేమానికి కోతలు విధిస్తాం అనే విధంగా పాలన సాగినంత కాలం ఒక విద్యుత్ రంగంలోనే కాదు పరిపాలన లోని అన్ని రంగాలలో ఒకదాని తర్వాత ఒకటి తీవ్ర సంక్షోభం ఎదుర్కొనాల్సి ఉంటుంది” అని ఐవైఆర్ హెచ్చరించారు. 2019 ఎన్నికలకు ముందు వరకూ చంద్రబాబు ప్రభుత్వ విధానాలను తూర్పార బట్టిన ఐవైఆర్ కృష్ణారావు గత కొంత కాలంగా జగన్ సర్కార్ లోని తప్పులపైనా విమర్శలు చేస్తున్నారు.