ఏపి సీఎం వైఎస్ జగన్ ను, ప్రభుత్వాన్ని దూషించిన కేసులో పోలీసులు అరెస్టు చేసిన ఏఆర్ కానిస్టేబుల్ తన్నీరు వెంకటేశ్వరరావు కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నందిగామ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో హైవే పెట్రోలింగ్ విభాగంలో పని చేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు ఇటీవల గౌరవరం గ్రామంలో టీస్టాల్ వద్ద పోలీసులకు సంబంధించి జీతాల అంశంపై మాట్లాడుతూ సీఎం జగన్ పై దుర్భాషలాడాడు. మూడు నెలల పాటు పోలీసులకు జీతాలు ఇవ్వకపోతే రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన వస్తుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఆదానీ గ్రూప్ పేరు ప్రస్తావించకుండానే.. భారత బ్యాంకింగ్ రంగంపై ఆర్బీఐ కీలక ప్రకటన
సదరు కానిస్టేబుల్ ముఖ్యమంత్రిని దుషిస్తున్న సమయంలో ఓ వ్యక్తి తన సెల్ ఫోన్ వీడియో తీసి పోలీసు ఉన్నతాధికారులకు పంపిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. చిల్లకల్లు పోలీసు స్టేషన్ లో ఆయన కేసు నమోదు చేయడం, వెంటనే అరెస్టు చేసి జగ్గయ్యపేట కోర్టులో హజరుపర్చడం జరిగింది. నిన్న మెజిస్ట్రేట్ నిందితుడికి 14 రోజులు రిమాండ్ విధించడంతో జగ్గయ్యపేట సబ్ జైలుకు తరలించారు. ఇదే సందర్భంలో ఉన్నతాధికారులు ఆయనను విధుల నుండి సస్పెండ్ చేశారు. కాగా నిందితుడి తరపున దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఇవేళ జగ్గయ్యపేటలో కోర్టులో వాదనలు జరిగాయి. నిందితుడు వెంకటేశ్వరరావు తరపున న్యాయవాదులు దొద్దాల కోటేశ్వరరావు, మాగులూరి హరిబాబులు వాదనలు వినిపించారు. వాదనలు విన్న కోర్టు వెంకటేశ్వరరావుకు బెయిల్ మంజూరు చేసింది.
సీఎం జగన్ పై నోరు పారేసుకుని అడ్డంగా బుక్కైన ఏఆర్ కానిస్టేబుల్