Juniour NTR Crises In TDP: తెలుగుదేశం పార్టీకి సంక్షోబాలు కొత్త కాదు. ఆగస్టు సంభాలు అంటూ ఆ పార్టీకి ఎప్పటి నుండో ఉంది. 2019లో రాష్ట్రంలో టీడీపీ ఘోర పరాజయాన్ని చవి చూసిన తరువాత జగన్ సర్కార్ లో టీడీపీకి ప్రతి రోజు, ప్రతి నెలా సంక్షోభమే. ఎప్పుడు ఏ గడ్డు పరిస్థితి వస్తుందో అనేది తెలుసుకోవడం, ఊహించడం చాలా కష్టంగా మారింది. జగన్మోహనరెడ్డి అధికారంలో ఉంటే ప్రతిపక్షంగా ఉండటం ఇంత కష్టమా అన్న పరిస్థితి ఉంది. టీడీపీకి జగన్ సర్కార్ లో చుక్కలు కనబడుతున్నాయి. ఇప్పుడు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ రూపంలో ఒక సంక్షోభం టీడీపీకి వచ్చి పడింది. ఈ సంక్షోభం పార్టీని ఏ దిశగా తీసుకువెళుతుంది, పార్టీని ఏ స్థితికి తీసుకువెళుతుంది, దీన్ని కొనసాగిస్తే మంచిదా, క్లోజ్ చేస్తే మంచిదా, దీనికి పరిష్కారాలు ఏమిటి, దీని వెనుక వైసీపీ రాజకీయ స్ట్రాటజీ ఏమైనా ఉందా. వైసీపీ వేసిన ట్రాప్ లో టీడీపీ చిక్కుకుందా అన్న ప్రశ్నలను పరిశీలిస్తే…
Juniour NTR Crises In TDP: చంద్రబాబు వద్ద జూనియర్ ఫ్యాన్స్ నిరసన
ఇటీవల రాయలసీమలో పర్యటించిన చంద్రబాబును జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అడ్డుకున్నారు. టీడీపీ నేతలతో జూనియర్ ఎన్టీఆర్ పై విమర్శలు ఆపించండి, జూనియర్ ఎన్టీఆర్ ను టీడీపీ వాళ్లు ఎవ్వరూ విమర్శించవద్దని డిమాండ్ చేశారు. వీళ్లు ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు టీడీపీ కార్యకర్తలు. మరో పక్క ఫ్యాన్స్ లో మరో వర్గం జూనియర్ ఏమైనా అంటే ఊరుకోము, పార్టీని విడిచి బయటకు వెళ్లడానికి సిద్ధం అని కూడా చెబుతున్నారు. ఈ పక్క టీడీపీ నేతలు వర్ల రామయ్య, బుద్ద వెంకన్న లాంటి నాయకులు రెండు రోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్ ను విమర్శించారు. ఈ పరిణామాన్ని టీడీపిలో జూనియర్ ఎన్టీఆర్ సంక్షోభం కిందే పరిగనించాల్సి ఉంటుంది. ఈ వ్యవహారంలో టీడీపీ ఎంత త్వరగా ముగింపు పలికితే ఆ పార్టీకి అంత మంచిది అన్న మాట ఆ పార్టీ వర్గాల నుండి వినబడుతోంది. టీడీపీ వాళ్ల బాధ ఏమిటి అంటే.. అసెంబ్లీలో భువనేశ్వరిని వైసీపీ సభ్యులు అసభ్యంగా మాట్లాడితే జూనియర్ ఎన్టీఆర్ సక్రమంగా రియాక్షన్ కాలేదు అన్నది. ఆయన మాటలు చూస్తే సరిగా స్పందించలేదు అనేది స్పష్టం అవుతూనే ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రతిష్టాత్మక సినిమా తీస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా స్పందిస్తే ఏపిలో సిినిమా విడుదల సందర్భంలో ఏమైనా ఇబ్బందులు వస్తాయని భావించారో లేక ఈ విషయంలో తాను అంతగా స్పందించాల్సిన అవసరం లేదని భావించారో, లేక నందమూరి ఫ్యామిలీని చంద్రబాబు మోసం చేస్తున్నారని వైసీపీ చేస్తున్న విమర్శలను నమ్ముతున్నారో తెలియదు కానీ ఆయన స్పందన మాత్రం పేలవంగా ఉంది.
వైసీపీ ట్రాప్ లో టీడీపీ
అయితే అసలు ఈ వ్యవహారం అంతా నందమూరి, నారా కుటుంబానికి సంబంధించింది. వాళ్లంతా కూర్చుని మాట్లాడుకుంటే సమస్య ఉండేది కాదు. కానీ టీడీపీ వాళ్లు జూనియర్ ఎన్టీఆర్ ను విమర్శించడం కరెక్టు కాదనే మాట ఓ సెక్షన్ నుండి వినబడుతోంది. ఈ పరిస్థితుల్లో టీడీపీ తెలివిగా ఆలోచించి వివాదాన్ని ఇంకా పెద్దది చేయకుండా ఇంతటితో ముగిస్తే మంచిదనీ, లేకుంటే వైసీపీ ట్రాప్ లో పడినట్లేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది వైసీపీ ట్రాప్ అని ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే నారా కుటుంబాన్ని తీవ్రంగా విమర్శిస్తున్న కొడాలి నాని, వల్లభనేని వంశీలు పూర్వాశ్రమంలో నందమూరి ఫ్యామిలీకి వీర విధేయులు. ప్రస్తుతం వీరు వైసీపీలో ఉన్నప్పటికీ నందమూరి ఫ్యామిలీని టార్గెట్ చేయకుండా కేవలం నారా కుటుంబాన్నే అంటే చంద్రబాబు, లోకేష్ లనే టార్గెట్ చేస్తున్నారు. ఇందులో ప్రధాన ఉద్దేశం నందమూరి, నారా కుటుంబాల మధ్య వివాదాన్ని రాజేసి నందమూరి కుటుంబానికి నారా కుటుంబాన్ని దూరం చేస్తే టీడీపీలో సంక్షోభం వస్తుందన్న వైసీపీ ఆలోచన కావచ్చు. అందుకే వాళ్లు జూనియర్ ఎన్టీఆర్ ను గానీ, నందమూరి బాలకృష్ణను గానీ వాళ్ల ఫ్యామిలీలో ఎవరినీ విమర్శించడం లేదు.
కాక పోతే ఈ స్ట్రాటజీ అంత వర్క్ అవ్వదనే కూడా చెప్పేవాళ్లు ఉన్నారు. ఎందుకంటే 1999లో అన్న తెలుగుదేశం పేరుతో నందమూరి హరికృష్ణ రాజకీయ పార్టీ పెడితే రెండు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఎవరూ గెలవలేదు. అదే మాదిరిగా నందమూరి లక్ష్మీపార్వతి కూడా రాజకీయ పార్టీ పెట్టారు. ఆమె పెట్టిన పార్టీకి ఒక్క శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఎవ్వరూ గెలవలేదు. అన్ని చూట్ల డిపాజిట్లు కోల్పోయారు. దీంతో ఆమె పార్టీని వైసీపీలో విలీనం చేసి ఆ పార్టీలో చేరిపోయారు. ఇలా టీడీపీకి గతంలో అనేక సంక్షోభాలు వచ్చాయి. ఆ సంక్షోభాలను చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ అధిగమిస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు టీడీపీ జూనియర్ ఎన్టీఆర్ ను తమ వైపు తిప్పుకుంటే మంచిదనీ, లేకుంటే ఆయన్ను అలాగే సినిమా ఇండస్ట్రీకి పరిమితం చేయాలని రాజకీయాల్లోకి లాగకుండా ఉంటే మంచిదన్న అభిప్రాయం ఆ పార్టీ కీలక నేతల నుండి వ్యక్తం అవుతుంది. ఈ వివాదాన్ని ఇంకా పెద్దది చేసి జూనియర్ ఎన్టీఆర్ ను దూరం చేసుకుంటే ఒకటి రెండు శాతం ఓట్లు చీలినా అది టీడీపీకి పెద్ద మైనస్ గా మారుతుంది అనేది ఆ పార్టీలోని సీనియర్ల అభిప్రాయంగా ఉంది.