Kadapa Ysrcp: రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి తన దైన శైలిలో పరిపాలనలో ముందుకు సాగుతున్నారు. ప్రతిపక్ష ఆరోపణలను ఏ మాత్రం పట్టించుకోకుండా తాము అనుకున్న నిర్ణయాలను అమలు చేస్తున్నారు. అభివృద్ధి పదంగా రాష్ట్రంలో ప్రగతి నిలిచిపోయినా సంక్షేమ పథకాలను ప్రభుత్వం కొనసాగిస్తూనే ఉంది. అప్పులు తీసుకువచ్చి మరీ నవరత్న పథకాలను ప్రజలకు అందిస్తున్నారు. ప్రభుత్వ పాలనను ప్రజలు వ్యతిరేకిస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు, విమర్శలు చేస్తున్నా ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు పంచాయతీ, మున్సిపల్, కార్పోరేషన్, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు వైసపీనే కైవశం చేసుకుంది. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి ఘన విజయం సాధించారు. ఇలా వైసీపీ వరుస విజయాలతో కుషీగా ఉండగా సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా కడప లో వైసీపీకి షాక్ ల మీద షాక్ తగులుతున్నాయి.
Kadapa Ysrcp: మొన్న డీఎల్..నిన్న దేవగుడి ఫ్యామిలీ
కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి..జగన్మోహనరెడ్డి సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మళ్లీ తాను క్రియాశీల రాజకీయాల్లో యాక్టివ్ అవుతాననీ, 2024 ఎన్నికల్లో పోటీ చేస్తాననిి కూడా చెప్పారు. అయితే ఏ పార్టీ నుండి పోటీ చేస్తారనేది చెప్పలేదు. వైసీపీకి దూరం అవుతున్నట్లు సంకేతాలు ఇచ్చేశారు. జగన్ పరిపాలనను తూర్పార పడుతూ విమర్శలు గుప్పించారు. ఇది జరిగి రెండు రోజులు అయ్యిందో లేదో వైసీపీ నుండి మరో కీలక నేత ఫ్యామిలీ వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించింది. ఈ పరిణామాలు సీఎం జగన్ సొంత జిల్లా కడప నుండి జరగడం గమనార్హం. రాష్ట్రంలో మరో రెండున్నరేళ్ల వరకూ ఎన్నికలు లేకపోయినా రెండున్నరేళ్ల అధికారాన్ని వదులుకొని వైసీపీ నేతలు ఆ పార్టీకి దూరం అవ్వడం దేనకి సంకేతమనేది విశ్లేషించుకోవాలి.
బీజేపిలో ఆది…టీడీపి లోకి నారాయణ రెడ్డి
కడప జిల్లాలో కీలకమయిన జమ్మలమడుగు నియోజకవర్గంలో దేవేగుడి ఫ్యామిలీని టీడీపీలోకి తెచ్చుకోవాలని నిర్ణయించారు. దీనిపై కొద్ది రోజులుగా తర్జన భర్జన జరుగుతుండగా నిన్న అధికారికంగా నిర్ణయాన్ని ప్రకటించారు. దేవగుడి వర్గం మొదటి నుండి కాంగ్రెస్ లో ఆ తరువాత వైసీపీలో ఉంది. దేవగుడి వర్గం నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయణ రెడ్డి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పార్టీలో చేరి మంత్రి అయ్యారు. 2014 ఎన్నికల్లో ఆదినారాయణ రెడ్డి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా అధికారంలోకి వచ్చి టీడీపీలో చేరి మంత్రి కూడా అయ్యారు. 2019 ఎన్నికల్లో జమ్మలమడుగు నుండి వైసీపీ అభ్యర్థిగా సుధీర్ కుమార్ రెడ్డి గెలిచారు., జమ్మలమడుగులో దేవగుడి వర్గం, రామసుబ్బారెడ్డి వర్గం సుదీర్ఘకాలంగా ఫ్యాక్షన్ ఉంది. రామ సుబ్బారెడ్డి వర్గం టీడీపీలో ఉండగా దేవగుడి వర్గం తొలుత కాంగ్రెస్ లో తర్వాత వైసీపీలో ఉంది. 2019 ఎన్నికల తరువాత ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరారు,. ప్రధాన వర్గాలు రెండూ బయటకు వెళ్లడంతో టీడీపీ పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది.
రెండేళ్లలో నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు మారాయి. దేవగుడి వర్గంలో చీలిక వచ్చింది. ఈ వర్గంలో ప్రధాన నేత, మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ నెల 20వ తేదీన తాను, తన కుమారుడు భుపేశ్ రెడ్డి చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. భూపేశ్ రెడ్డి నియోజకవర్గ ఇన్ చార్జి బాధ్యతలు స్వీకరించి నియోజకవర్గంలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకువస్తామని నారాయణరెడ్డి ప్రకటించారు.