KTR : కేటీఆర్ టీఆఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు మరియు మంత్రి. తెలంగాణ ముఖ్యమంత్రి పీఠం అధిరోహిస్తున్నారని గత కొద్దికాలంగా పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్న అంశం.
ఏకంగా మంత్రులే ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే, ఇదే సమయంలో ప్రతిపక్షాలపై తనదైన శైలిలో దూకుడు కొనసాగిస్తున్నారు. తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటి పై జరిగిన దాడిని కే తారకరామారావు ఖండించారు. అంతేకాకుండా కీలక వ్యాఖ్యలు చేశారు.
KTR : బీజేపీపై ఫుల్ ఫైర్
ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఏ మాత్రం చోటు లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజాస్వామ్యంలో తమ వాదనతో ప్రజలను ఒప్పించడం చేతకాక, ఇతర పార్టీలపైన భౌతిక దాడులు చేస్తూ తమ వాదన వినిపించాలని ప్రయత్నం చేస్తున్న బీజేపీ తీరుని ప్రజాస్వామ్యవాదులు అంతా ఖండించాల్సిన అవసరం ఉందని అన్నారు. రాజకీయాల్లో హేతుబద్ధమైన విమర్శలను దాటి, భౌతిక దాడులకు బిజెపి పదే పదే దిగడం తెలంగాణ రాజకీయాలకు ఏ మాత్రం వాంఛనీయం కాదని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులను, ప్రతి కార్యకర్తను కాపాడుకునే శక్తి, బలం, బలగం మాకు ఉన్నాయన్న విషయాన్ని బీజేపీ గుర్తుంచు కోవాలని అన్నారు.
బయట తిరుగలేరు…
టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఓపిక నశిస్తే, బీజేపీ కనీసం బయట తిరగలేని పరిస్థితి ఏర్పడుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కేటీఆర్ హెచ్చరించారు. బీజేపీ భౌతిక దాడులను ఎదుర్కొనే శక్తి టీఆర్ఎస్ పార్టీకి ఉన్నదన్న ఆయన మా ఓపిక కి ఒక హద్దు ఉంటుందని ఇప్పటికే బీజేపీని హెచ్చరించామని ఆయన అన్నారు. ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా సంయమనంతో, ఓపికతో ముందుకు పోతున్నామని ఆయన అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీ అన్న విషయాన్ని బిజెపి మర్చిపోకూడదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ప్రశాంతంగా ఉన్న తెలంగాణ సమాజంలో చిచ్చు పెట్టేలా బిజెపి చేస్తున్న కుటిల ప్రయత్నాలను రాష్ట్ర ప్రజలు, గమనించి బీజేపీని ఎక్కడికక్కడ నిలదీయాలని విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన అన్నారు.