TTD Board Member: రాజకీయాల్లో కొందరు నాయకులకు పదవులు ఆశించినా రావు. కానీ కొందరికి అనూహ్యంగా పదవులు వస్తుంటాయి. జాబితాలో చివరి వరకూ ఉన్న పేర్లు గల్లంతు అవుతుంటాయి, కొత్త పేర్లు వస్తుంటాయి. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) డైరెక్టర్ పదవికి అంటే వివిధ రాష్ట్రాల్లో ఎంతో మంది ప్రముఖులు, కోటీశ్వరులు, రాజకీయ పార్టీ నేతలు ఎగిరి గంతేస్తారు. ఒక్క సారి అవకాశం వస్తే చాలు అనుకునే వారు ఉంటారు. అయితే మంత్రి పదవిపై ఆశపెట్టుకున్న ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే టీటీడీ డైరెక్టర్ పదవి పట్ల విముఖత వ్యక్తం చేశారు. టీటీడీ డైరెక్టర్ పదవి పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడంతో అదే సామాజిక వర్గానికి చెందిన మరో ఎమ్మెల్యేకి అనూహ్యంగా ఆ పదవి దక్కింది.
విషయంలోకి వెళితే..జగన్మోహనరెడ్డి సర్కార్ టీటీడీ పాలకమండలిని ప్రకటించింది. 28 మంది సభ్యులతో (నలుగురు ఎక్స్ అఫిషియో సభ్యులు) పాలకవర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక ఆహ్వానితులుగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ సుధాకర్ లను ప్రభుత్వం నియమించింది. పాలకమండలిలో విశాఖ జిల్లా పాయికారావుపేట ఎమ్మెల్యే గోళ్ల బాబూరావును ఎస్సీ కోటాలో టీటీడీ డైరెక్టర్ గా నియమించాలని సీఎం జగన్మోహనరెడ్డి భావించారు. టీటీడీ సభ్యుల జాబితా మీడియాకు లీక్ కావడంతో డైరెక్టర్ గా గోళ్ల బాబూరావు పేరు ఉండటంతో పలువురు ఆయనకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. అయితే ఆయన టీటీడీ బోర్డు మెంబర్ పదవి ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బోర్డు మెంబర్ పదవిని ఆయన తిరస్కరించారు.
మంత్రి పదవి ఆశిస్తే తనకు టీటీడీ పదవి ఇవ్వడం అవమానించడమేనని బాబూరావు పేర్కొన్నారు. పాదయాత్ర సమయంలో జగన్ వెంట నడిచిన వారిలో తాను ముందు వరుసలో ఉన్నానని పేర్కొన్న బాబూరావు..తనకు అన్యాయం జరిగిందంటూ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారట. బాబూరావు డైరెక్టర్ పదవిని తిరస్కరించడంతో అదే సామాజిక వర్గానికి చెందిన నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట వైసీపీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యను టీటీడీ డైరెక్టర్ జాబితాలో చేర్చారు. బాబూరావు కాదనడంతో సంజీవయ్యకు అనూహ్యంగా టీటీడీ డైరెక్టర్ పదవి దక్కింది. శ్రీవారికి సేవ చేసుకునే అవకాశం కోసం ఎందరో తపిస్తుండగా వచ్చిన అవకాశాన్ని ఓ నేత కాలదన్నుకోవడం, మరో నేతకు అవకాశం లభించడం అంతా శ్రీవారి దయేనేమో. టీటీడీ అవకాశాన్ని వదులుకున్న గోళ్ల బాబూరావుకు రాబోయే మంత్రివర్గ విస్తరణలో చోటు లభిస్తుందో లేదో వేచి చూడాలి.