MP Vijaya Sai: వైసీపీకి, ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి రెబల్ ఎంపి రఘురామకృష్ణం రాజు కొరకని కొయ్యగా మారిన సంగతి తెలిసిందే. ఏపి ప్రభుత్వ విధానాలపై సీఎం జగన్మోహనరెడ్డిపై రఘురామ కృష్ణంరాజు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ కూడా తెలంగాణ హైకోర్టులో రఘురామ పిటిషన్ కూడా దాఖలు చేశారు. మరో పక్క రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలంటూ పలు మార్లు వైసీపీ ఎంపీలు స్పీకర్ ఓంబిర్లాకు ఫిర్యాదు చేశారు. అయితే స్పీకర్ ఆయనపై ఇంత వరకూ చర్యలు తీసుకోలేదు. వైసీపీ ఫిర్యాదుపై రఘురామకృష్ణం రాజు కు స్పీకర్ నోటీసు ఇచ్చారు. దానిపై రఘురామ రిప్లై ఇచ్చారు.
MP Vijaya Sai: బీజేపీ అండదండలు ఉండటంతో
ఇటీవల ఈ వ్యవహారాన్ని ప్రివిలేజ్ కమిటీకి స్పీకర్ రిఫర్ చేశారు. అయితే రఘురామకు కేంద్రంలోని బీజేపీ అండదండలు ఉండటంతోనే ఆయనపై చర్యలు తీసుకోవడం లేదన్న మాట వినబడుతోంది. ఈ తరుణంలోనే తాను ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నానంటూ గత నెల రఘురామకృష్ణంరాజు ప్రకటించారు. తనపై అనర్హత వేటు వేయించలేము అని వైసీపీ పెద్దలు ఒప్పుకుంటే తక్షణమే రాజీనామా చేస్తానంటూ రఘురామ సవాల్ కూడా విసిరారు. వైసీపీ ప్రభుత్వాన్ని నిత్యం విమర్శిస్తున్న రఘురామ కృష్ణంరాజును ఇరుకున పెట్టేందుకు వైసీపీ శత విధాలుగా ప్రయత్నిస్తూనే ఉంది. ఈ తరుణంలోనే కొద్ది నెలల క్రితం ఏపీ సీఐడి ఆయనను రాజద్రోహం తదితర సెక్షన్ల కింద అరెస్టు చేసింది. ఆ తరువాత ఆయన బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే.
సీబీఐ డైరెక్టర్ సుభోధ్ కుమార్ జైస్వాల్ కు లేఖ
ఇప్పుడు విజయసాయి రెడ్డి తాజాగా రఘురామ కృష్ణంరాజుపై సీబీఐకి పిర్యాదు చేశారు. సీబీఐ డైరెక్టర్ సుభోధ్ కుమార్ జైస్వాల్ కు విజయసాయి రెడ్డి లేఖ రాశారు. రఘురామ కృష్ణంరాజుకు చెందిన ఇండ్ భారత్ పవర్ ఇన్ ఫ్రా లిమిటెడ్ లో జరిగిన అక్రమాలపై త్వరితగతిన విచారణ చేపట్టాలని లేఖలో విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అంతే కాకుండా రఘురామ కృష్ణంరాజు కంపెనీ దోచేసిన ప్రజల సొమ్మును రికవరీ చేయాలని కూడా విజయసాయి రెడ్డి కోరారు.