Nadendla Manohar: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో రాజధాని విషయంలో రగడ ఎప్పటినుండో రగులుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తే తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల కాన్సెప్ట్ తెరపైకి రావడం తెలిసిందే. అమరావతిలో శాసనసభ రాజధాని ఇంకా కర్నూలులో న్యాయ రాజధాని అదేవిధంగా విశాఖలో పరిపాలన రాజధాని ఉండడం ఉన్నట్లు వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. పరిస్థితి ఇలా ఉంటే నిన్న బెంగళూరులో ఓ సదస్సులో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వైజాగ్ యే ఏకైక రాజధాని అన్నట్టు పరోక్ష వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో బుగ్గన చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.
అయితే ఇదే విషయంపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. విశాఖను రాజధానిగా ఎవరు కోరుకోవటం లేదని స్పష్టం చేశారు. విశాఖ రాజధాని అంశంలో ఉత్తరాంధ్రలకు నమ్మకం లేదని వ్యాఖ్యానించారు. అసలు రాజధాని విషయంలో మంత్రుల మధ్యే సఖ్యత లేదని చెప్పుకొచ్చారు. సీఎం జగన్ కి సవాల్ చేస్తున్నాం. దమ్ముంటే రాజధాని అజెండాతో ఎన్నికలకు వెళదాం రండి అని స్పష్టం చేశారు. ఇలాంటి దౌర్భాగ్యపు పాలన ఎక్కడ చూడలేదని చెప్పుకొచ్చారు. విశాఖలో ప్రభుత్వ కార్యాలయాలు పెట్టినంతమాత్రాన.. తమ జీవితాలు మారతాయని ఉత్తరాంధ్ర ప్రజలు భావించటం లేదని చెప్పుకొచ్చారు.
రోడ్లు వేయలేరు కనీసం ఉన్న రాజధాని ఉద్ధరించలేని ముఖ్యమంత్రి అంటూ సెటైర్లు వేశారు. త్వరలోనే నేను విశాఖ వెళ్లిపోతానని ముఖ్యమంత్రి అంటారు, విశాఖ రాజధాని చేయకపోతే ఉత్తరాంధ్ర అని మరో రాష్ట్రంగా గుర్తించాలని ఓ మంత్రి అంటారు. రాజకీయ లబ్ధి కోసం ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని వైసీపీ నేతలపై నాదెండ్ల మనోహర్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు. చిత్తశుద్ధి ఉన్నవారైతే అమరావతితో పాటు విశాఖ కర్నూలు ను ఒకే రీతిలో అభివృద్ధి చేయాలని స్పష్టం చేశారు. అమరావతి యే రాష్ట్రానికి ఏకైక రాజధాని ఇది జనసేన విధానమని నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు.