ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణానదికి వరద ఉదృతి కొనసాగుతోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల నుండి భారీగా వరద నీరు దిగువకు ప్రవహిస్తొంది. శ్రీశైలం జలాశయానికి వరద ఉదృతి కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు అధికారులు పది గేట్లు 15 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఇన్ ఫ్లో 3,92,782 క్యూసెక్కులుగా ఉండగా ఔట్ ఫ్లో 4,26,809 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.70 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 216.807 టీఎంసీలు కాగా ప్రస్తుతం 213.882 టీఎంసీలుగా కొనసాగుతోంది. ప్రాజెక్టు కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
అదే విధంగా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు అధికారులు 22 క్రస్ట్ గేట్లు పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3,93,269 లక్షల క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 588.1 అడుగులుగా ఉంది. సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 306.397 టీఎంసీలుగా కొనసాగుతోంది.
ఇక పులిచింతల నుండి ప్రకాశం బ్యారేజ్ కు వరద ప్రవాహం పెరుగుతోంది. వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రకాశం బ్యారెజ్ అధికారులు అప్రమత్తమై హెచ్చరికలు జారీ చేశారు. నిన్నటి కంటే ఈ రోజు వరద ప్రవాహం పెరిగింది. ప్రస్తుతం ప్రకాశం బ్యారెజ్ కి ఇన్ ఫ్లో 4,49,263 క్యూసెక్కుల వస్తుండగా అంతే మొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నారు. నాలుగు లక్షలకు పైగా వరద నీరు దిగువకు విడుదల చేస్తున్న క్రమంలో కృష్ణానదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ అధికారులు సూచిస్తున్నారు.
బ్రేకింగ్: సాలూరు పోలీస్ స్టేషన్ లో భారీ పేలుడు.. మ్యాటర్ ఏమిటంటే..?