Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఓ వైపు సినిమాల్లో బిజీ బిజీగా గడుపుతూనే మరోవైపు తన రాజకీయ ఎత్తుగడలు సైతం వేగంగానే అమలు చేస్తున్నారు. ఏపీలో బీజేపీకి భాగస్వామ్య పక్షంగా జనసేన పార్టీ ఉన్నప్పటికీ ప్రజల ప్రయోజనాల విషయంలోనూ తమ గొంతు వినిపిస్తామనే సందేశాన్ని పంపిస్తున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదన ఏపీలో కాకరేపుతుండటంతో పవన్ వెంటనే ఢిల్లీకి పయనం అయ్యారు. హస్తిన పర్యటనలో ఉన్న జనసేనాని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతో సమావేశం అయ్యారు. అరగంటకు పైగా ఈ సమావేశం కొనసాగింది.
Pawan Kalyan పవన్ భలే గేమ్…
విశాఖ స్టీల్ కర్మాగారంపై ప్రభుత్వ ఆలోచన, వాస్తవాలు తెలుకొనేందుకు ఢిల్లీ వెళ్లారు పవన్.. లోకసభ సమావేశం ముగియగానే కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశం కావాలని ప్లాన్తో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన పవన్ కల్యాణ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై చర్చించినట్టు తెలుస్తోంది. ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఏపీ ప్రజల మనోభావాలు దెబ్బతింటున్న విషయాన్ని ప్రధానంగా పవన్ కళ్యాణ్ అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. అంతేకాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్పై ఈ భేటీలో షాకు వినతిపత్రం కూడా అందజేశారు. తద్వారా , భవిష్యత్తులో బీజేపీ మిత్రపక్షంగా తాను గలం వినిపించలేకపోయాననే అపప్రదను ఎదుర్కోకుండా పవన్ బీజేపీని ఇరికించారని అంఉటన్నారు.
ఆ విషయం కూడా చెప్పేశారా?
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీలో టూర్ సందర్భంగా తిరుపతి ఉప ఎన్నికలు, తాజా రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇక, మరికొంతమంది కేంద్ర మంత్రులతో పాటు.. బీజేపీ అగ్రనేతలను కూడా ఈ పర్యటనలో పవన్ కల్యాణ్ కలవనున్నారు. మరోవైపు ఏపీలోని తాజా రాజకీయ పరిణామాలు, సంయుక్త భవిష్యత్ కార్యాచరణపై కూడా బీజేపీ అగ్రనాయకత్వంతో జనసేన నేతల చర్చించే అవకాశం ఉందంటున్నారు. మొత్తంగా ఇటు ఏపీలోని పరిణామాలను గురించి తెలియజేస్తూనే కీలకమైన ఉక్కు ఫ్యాక్టరీ గురించి పార్టీ ముఖ్య నేతలకు తెలియజెప్పి బాల్ బీజేపీ కోర్టులోకి నెట్టారని అంటున్నారు.