AP Assembly: గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో పెగాసస్ స్పైవేర్ డేటా చోరీ నివేదిక బుధవారం ఏపీ అసెంబ్లీలో సమర్పించడం జరిగింది. దీనికి సంబంధించి విచారణ చేపట్టిన సభా సంఘం స్పీకర్ కి నివేదిక అందజేశారు. డేటా చోరీ పై ఏర్పాటు చేసిన సభా సంఘం కమిటీ చైర్మన్ భూమ్మన కరుణాకర్ రెడ్డి నివేదికలో పలు అంశాలను సభ దృష్టికి తీసుకొచ్చారు. ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని తెలుగుదేశం పార్టీ కీలక వ్యక్తులకు “సేవా మిత్ర” యాప్ ద్వారా ఈ పెగాసస్ స్పైవేర్ ఉపయోగించి.. ఓట్లను రద్దు చేసే కార్యక్రమం గత ప్రభుత్వం చేసినట్లు విచారణలో తేలినట్లు తెలిపారు.
దీనికి సంబంధించి అనేకమందిని ఇంకా విచారించాల్సిన అవసరం కూడా ఉంది గనుక.. మధ్యంతర నివేదిక నేడు ప్రవేశపెట్టినట్లు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ప్రాథమిక విచారణలో గత ప్రభుత్వం నూటికి నూరు శాతం ప్రజల సమాచారాన్ని చోరీ చేసినట్లు సభా సంఘం నిర్ధారణకు వచ్చినట్లు.. సభా స్పీకర్ కి తెలియజేశారు. ప్రభుత్వం దగ్గర స్టేట్ డేటా సెంటర్ లో ఉండాల్సినటువంటి ప్రజల సమాచారాన్ని.. టిడిపికి సంబంధించిన సేవా మిత్రా యాప్ ద్వారా.. పూర్తిగా ప్రజలకు తెలియకుండా వాళ్ళ వ్యక్తిగత సమాచారాన్ని చౌర్యం చేశారని అన్నారు. ఈ
చౌర్యం చేసిన చోరులను పట్టుకోవడానికి సభా సంఘం అన్ని విధాల కృషి చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం వద్ద ఉండాల్సిన సమాచారాన్ని ప్రైవేటు వ్యక్తులు దొంగలించారని పేర్కొన్నారు. తమకు అనుకూలంగా లేరని 30 లక్షల మంది డేటాను గత టిడిపి ప్రభుత్వం తొలగించిందనే ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు డేటా చోరీ పై ఏర్పాటు చేసిన సభా సంఘం కమిటీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.