టీడీపీపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నఅన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జీవీ శ్రీనాథ్ రెడ్డి వైసీపీ చేరారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి సమక్షంలో గురువారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. సీఎం జగన్ ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. శ్రీనాథ్ రెడ్డి తో పాటు పీలేరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు జీవిీ రాకేష్ రెడ్డి, ఎం వెంకట కృష్ణారెడ్డి, వి ఉమాకాంత్ రెడ్డి, బి నరేందర్ రెడ్డి, జి నరేష్ కుమార్ రెడ్డిలు వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో రాజంపేట ఎంపీ పీవీ మిథున్ రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మైనార్టీ కమిషన్ చైర్మన్ ఇక్బాల్ అహ్మద్ ఖాన్ పాల్గొన్నారు.
జీవీ శ్రీనాథ్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఇది
టీడీపీ ఆవిర్భావం నుండి ఆ పార్టీలో ఉన్న శ్రీనాథ్ రెడ్డి ఎన్టీఆర్ ప్రభంజనంలో 1994లో పీలేరు నియోజకవర్గం నుండి మొదటి సారి ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. ఆ తరువాత 1999, 2004 ఎన్నికల్లో పీలేరు నియోజకవర్గం నుండి పోటీ చేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతిలో పరాజయం పాలైయ్యారు. 2009 ఎన్నికల్లో శ్రీనాథ్ రెడ్డికి చంద్రబాబు టికెట్ ఇవ్వలేదు. నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో 2009లో పీలేరు నుండి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. 2011లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత తన నియోజకవర్గంలో పట్టుపెంచుకునేందుకు జీవీ శ్రీనాథ్ రెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకున్నారు,. ఆ తర్వాత టీటీడీ బోర్డు సభ్యుడు పదవి ఇచ్చారు. 2014 ఎన్నికలకు ముందు కిరణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీని వీడి సమైక్యాంధ్ర పార్టీ స్థాపించడంతో శ్రీనాథ్ రెడ్డి కూడా ఆయన వెంటే నడిచారు. సమైక్యాంధ్ర అభ్యర్ధిగా పోటీ చేసిన కిషోర్ కుమార్ రెడ్డి కోసం శ్రీనాథ్ రెడ్డి పని చేశారు. ఈ ఎన్నికల్లో చింతల రామచంద్రారెడ్డి వైసీపీ నుండి గెలిచారు.
రాష్ట్రంలో టీడీపీ అధికారంలో వచ్చిన నేపథ్యంలో బొజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా మంతనాలు జరిపి శ్రీనాథ్ రెడ్డి టీడీపీలో చేరారు. ఆ తర్వాత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీ లో చేరడంతో శ్రీనాథ్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మరో పక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీనాథ్ రెడ్డి లకు దశాబ్దాల తరబడి తీవ్రమైన రాజకీయ వైరం ఉంది. అయినప్పటికీ శ్రీనాథ్ రెడ్డిని వైసీపీలో చేర్చుకునేందుకు 2017లోనే పెద్దిరెడ్డి తమ మధ్య ఉన్న వైరాన్ని పక్కనపెట్టి ఆయన ఇంటికి వెళ్లి మంతనాలు జరిపారు. ఈ పరిణామం ఆనాడు తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. అయినప్పటికీ 2019 ఎన్నికల్లో శ్రీనాథ్ రెడ్డి టీడీపీలోనే ఉన్నారు. ఈ ఎన్నికల్లో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి చంద్రబాబు టికెట్ ఇవ్వగా ఓటమి పాలైయ్యారు. 2024 ఎన్నికల్లోనూ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికే టీడీపీ టికెట్ కన్ఫర్మ్ చేసే అవకాశం ఉండటంతో శ్రీనాథ్ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పారు. పీలేరు నియోజకవర్గంలో వైసీపీని మరింత బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా శ్రీనాథ్ రెడ్డికి భవిష్యత్తులో అవకాశం కల్పిస్తామని హామీలు ఇవ్వడంతో ఆయన వైసీపీ తీర్ధం పుచ్చుకున్నట్లు సమాచారం.
రాష్ట్రవిభన అంశంపై ఏపి ప్రభుత్వ సలహాదారు సజ్జల సంచలన కామెంట్స్