YSRCP: ఏపీలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. అధికార వైసీపీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ యువనేత నారా లోకేష్ నిత్యం ఘాటైన విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. వీరి విమర్శలను అదే స్థాయిలో వైసీపీ తిప్పికొట్టడంతో పాటు ఆయా పార్టీలపై వూహ్యాత్మంగా వ్యవహరిస్తొంది. టీడీపీ, జనసేనలో అసంతృప్తి నేతలను వైసీపీలో చేర్చుకుంటోంది. ఈ క్రమంలోనే నిన్న ఉమ్మడి విజయనగరం, విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ అసంతృప్తి నేతలు జగన్ సమక్షంలో వైసీపీలో చేరగా, ఇవేళ జనసేన నేత వైసీపీలో చేరారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవేళ జగ్గంపేట పర్యటనకు వెళ్లిన సమయంలో జనసేన నేత రాయపురెడ్డి ప్రసాద్ (చిన్నా) వైసీపీలో చేరారు. రాయపురెడ్డి చిన్నాకు సీఎం జగన్ పార్టీ కండువా కప్పిసాదరంగా ఆహ్వానించారు. రాయపురెడ్డి చిన్నా గత ఎన్నికల్లో రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి జనసేన అభ్యర్ధిగా పోటీ చేశారు. దాదాపు 20వేలకు పైగా ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత జనసేన నియోజకవర్గ బాధ్యతలను చిన్నా నుండి తప్పించి మేడా గురుదత్ కు అప్పగించారు. రీసెంట్ గా మేడా గురుదత్ కు పార్టీలో మరో ముఖ్య పదవి అప్పగించి రాజానగరం పార్టీ ఇన్ చార్జిగా బత్తుల బలరామకృష్ణ కు బాధ్యతలు అప్పగించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
దీంతో రాబోయే ఎన్నికల్లో బత్తుల బలరామకృష్ణ జనసేన అభ్యర్ధిగా ఖరారు చేసినట్లు అయ్యింది. ఇన్ చార్జి బాధ్యతల నుండి తప్పించిన తర్వాత పార్టీ పై అసంతృప్తిగా ఉన్న రాయపురెడ్డి ప్రసాద్ (చిన్నా) ఇవేళ వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జనసేన పరిస్థితి బాగోలేదనీ, అందుకే వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. వైసీపీ అందరినీ కలుపుకుపోతుందని అన్నారు. ఏపీలో మరో సారి వైసీపీ అధికారంలోకి వస్తుందని తెలిపారు.
YS Jagan: నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైఎస్ జగన్