Sajjala Rama Krishna Reddy: వైసీపీ శ్రేణుల చర్యలను నిరసిస్తూ టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandra Babu) పార్టీ కార్యాలయంలో 36 గంటల దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. చంద్రబాబు చేపట్టిన దీక్షపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Rama Krishna Reddy) హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు దీక్ష ఓ ప్రహసనమని విమర్శించారు. అర లీటరు నీటితో 36 గంటల దీక్ష సాధ్యమేనా అని ప్రశ్నించారు. 70 ఏళ్ల పైబడి వయసు ఉన్న చంద్రబాబు 36 గంటల దీక్ష చేస్తే నీరసం రాదా అని అన్నారు. 36 గంటల పాటు దీక్ష చేసిన వ్యక్తి అంత సేపు మాట్లాడగలరా అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు సజ్జల.. బాబు దీక్ష ఓ డ్రామాగా ఆయన అభివర్ణించారు.
Sajjala Rama Krishna Reddy: పేరుకు గాంధేయవాదం – అంతా బూతులే
ఈ దీక్ష ద్వారా చంద్రబాబు ఏమి సాధించారని ఎద్దేవా చేశారు. గాంధేయ వాదం పేరుతో బూతులు మాట్లాడారనీ, బూతులు మాట్లాడటం మా హక్కు అన్నట్లుగా చంద్రబాబు వ్యవహరించారని మండి పడ్డారు. బూతు వ్యాఖ్యలను సమర్ధిస్తూ ఏవరైనా దీక్షలు చేస్తారా అని ప్రశ్నించారు. ఈ దీక్ష ఎందుకో టీడీపీ నేతలకే అర్ధం కావడం లేదని సజ్జల అన్నారు. పట్టాభి వాడిన పదానికి టీడీీప కొత్త అర్ధం చెబుతోందనీ విమర్శించిన సజ్జల ఈ పద ప్రయోగాన్ని చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో చేయగలరా అని ప్రశ్నించారు. దీక్ష పేరుతో సంఘ విద్రోహ శక్తులన్నీ ఒక్క చోటకు చేరాయనీ, పేరుకు గాంధేయవాదం.. మాట్లాడేదంతా బూతులు అని సజ్జల విమర్శించారు.
పట్టాభితో వ్యాఖ్యలు చేయించిందే చంద్రబాబు
దీక్షకు వచ్చిన వాళ్లు అందరూ దాడులు చేస్తామంటూ సవాళ్లు విసిరారని సజ్జల అన్నారు. దీక్షకు వచ్చిన వాళ్లు విరాళాలు ఇవ్వడం, కాళ్లు మొక్కడం ఏమిటని ప్రశ్నించారు. పట్టాభి బూతులు ఏం మాట్లాడారో తెలియదని చంద్రబాబు పేర్కొన్నారనీ, పట్టాభితో ఆ మాట అనిపించేందే చంద్రబాబు అని సజ్జల ఆరోపించారు. చంద్రబాబు హయాంలోనే గంజాయి దందా జరిగిందని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని సజ్జల పేర్కొన్నారు. అక్రమ మద్యాన్ని నివారించేందుకు ఎస్ఈబీని నియమించిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో హింసను పురిగొల్పుతున్నదే చంద్రబాబు అని అన్నారు. రాష్ట్రంలో విద్వేషం సృష్టించేందుకు చంద్రబాబు ఈ వ్యాఖ్యలు పట్టాభితో చేయించారని ఆరోపించారు. తొందరగా అధికారంలోకి వచ్చేందుకు రాష్ట్రపతి పాలన పెట్టమంటున్నారనీ, ఇదంతా ఓ నాటకమని సజ్జల పేర్కొన్నారు.