Sajjala Ramakrishna Reddy: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారనీ, ఆర్ధిక క్రమ శిక్షణ లేకుండా అప్పులు చేసి సంక్షేమ పథకాలకు పంపిణీ చేస్తూ రాష్ట్రాన్ని దివాలా తీశారనీ ఇటీవల బీజేపీ నేతలు తరచు విమర్శలు గుప్పించడంతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి వినతి పత్రం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల ఏపి బీజేపీ నేతల బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఫిర్యాదు చేయడం, ఆ నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక కార్యదర్శులతో మాట్లాడి నివేదిక కోరడం తెలిసిందే. బీజేపీ నేతల విమర్శలను రాష్ట్ర మంత్రులు తిప్పి కొట్టడం లేదని సీఎం వైఎస్ జగన్ ఇటీవల మంత్రివర్గ సమావేశంలో క్లాస్ తీసుకున్నారని వార్తలు వచ్చాయి. ఇక ఆ తరువాత మంత్రి పేర్ని నాని, డిప్యూటి సీఎం అంజద్ బాషాలు బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ కుట్రలు చేస్తుందంటూ సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా కేంద్రంలోని బీజేపీ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Read More: TTD Chairman: వద్దువద్దంటున్నా ఆ నేతకు మళ్లీ అదే పదవి..! వైవీ అలకవీడినట్లేనా..!?
బీజేపీ పాలనలో కేంద్ర ప్రభుత్వం ఏమైనా తక్కువ అప్పులు చేసిందా అని ప్రశ్నించారు. దాదాపు కోటి 16లక్షల అప్పు చేసిందని సజ్జల లెక్కలు చెబుతూ కోవిడ్ సమయంలోనే రూ.20లశ్రల కోట్లు అదనంగా అప్పు చేసిందని అన్నారు. కేంద్రం చేసిన అప్పులతో పోలిస్తే రాష్ట్రం చేసిన అప్పు చాలా తక్కువ అని అన్నారు సజ్జల. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతకు మించి అప్పులు చేశారని అన్నారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్రం అప్పులపాలైందని బీజేపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని వైసీపీ నేతలు తిప్పికొట్టాలని సజ్జల పిలుపునిచ్చారు. ప్రజల చేతిలో డబ్బులు ఉంటేనే కొనుగోళ్లు పెరిగి రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్న ఉద్దేశంతో సీఎం జగన్ నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో లక్షల కోట్ల రూపాయలకుపైగా జమ చేస్తున్నారని అన్నారు.
సీఎం జగన్ అనుసరించే మత విశ్వాసాన్ని అడ్డుపెట్టుకుని బీజేపి దుష్ప్రచారాన్ని చేసేందుకు ప్రయత్నిస్తోందని దీన్ని సమర్ధవంతంగా పార్టీ శ్రేణులు తిప్పికొట్టాలన్నారు. బీజేపీ నేతలకు ప్రజల సమస్యలపై పోరాటం, సమస్యల పరిష్కారం అనే అజెండా లేదనీ, మతం ప్రాతిపదికన దుష్ప్రచారం చేయడమే వారి అజెండా అని విమర్శించారు సజ్జల. సజ్జల చేసిన కామెంట్స్ పై బీజేపీ నేతలు ఏ విధంగా సమాధానం చెబుతారో వేచి చూడాలి.