YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి సుప్రీం కోర్టులో సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకా హత్య కేసులో తెలంగాణ హైకోర్టు వైఎస్ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు సుప్రీం కోర్టులో సునీత పిటిషన్ పై విచారణ జరిగింది.
సునీత తరపున సీనియర్ కౌన్సిల్ సిద్ధార్ధ లుథ్రా వాదనలు వినిపించారు. ఈ క్రమంలో వైఎస్ అవినాష్ రెడ్డి, సీబీఐలకు సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 3వ తేదీకి వాయిదా వేసింది. ఇంతకు ముందు విచారణ సందర్భంలో సీబీఐకి నోటీసులు ఇవ్వడానికి సుప్రీం కోర్టు అంగీకరించలేదు. కానీ ఈ రోజు సీనియర్ కౌన్సిల్ సిద్దార్ధ్ లూథ్రా వాదనలు వినిపించిన తర్వాత అవినాష్ రెడ్డి, సీబీఐలకు నోటీసులు జారీ చేయడంతో పాటు ఈ కేసు విచారణ ను జూలై 3వ తేదీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం చేస్తుందని సుప్రీం కోర్టు ధర్మాసనం తెలిపింది.
కాగా, గత మంగళవారం అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లాతో కూడిన వెకేషన్ బెంచ్ ముందు విచారణకు వచ్చింది. అయితే తమ ముందున్న కేసుల్లో సీనియర్ న్యాయవాదులు వాదించడానికి ధర్మాసనం అనుమతించలేదు. దాంతో సునీతారెడ్డే స్వయంగా వాదనలు వినిపించారు. ఆమెకు సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా సహకరించడానికి ధర్మాసనం అనుమతించింది. సునీత తన వాదనలు వినిపించారు. సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి సహకరించడం లేదనీ, కావున ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరారు. సీబీఐకి నోటీసులు జారీ చేయాలని కోరగా అందుకు ధర్మాసనం అంగీకరించలేదు. వేరే ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోవడం సరికాదన్న వెకేషన్ బెంచ్, తదుపరి విచారణను నేటికి (జూన్ 19) వాయిదా వేసింది.
చంద్రబాబు మేనిఫెస్టో పై విజయసాయి విసుర్లు .. మరో సారి యూటర్న్ అంటూ..