సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు జగన్ సర్కార్ క్యాబినెట్ ర్యాంక్ తో కూడిన కీలక పదవి ఇచ్చింది. ఆయనను ప్రెస్ అకాడమి చైర్మన్ గా ఏపి ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రెస్ అకాడమి చైర్మన్ గా కొమ్మినేని ఈ నెల 7వ తేదీ నుండి రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. 1978లో పాత్రికేయ రంగంలోకి అడుగు పెట్టిన కొమ్మినేని ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలతో పాటు పలు న్యూస్ ఛానల్స్ లో కీలక హోదాలో పని చేశారు. ప్రస్తుతం సాక్షి టీవీలో కేఎన్ఆర్ లైవ్ షో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 లో దేవిరెడ్డి శ్రీనాథరెడ్డి ప్రెస్ అకాడమి చైర్మన్ గా నియమితులైయ్యారు. ఆయన పదవీ కాలం రెండేళ్లు పూర్తి అవ్వగా గత ఏడాది నవంబర్ 7వ తేదీ ప్రభుత్వం మరో ఏడాది పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నెల 7వ తేదీతో శ్రీనాథ్ రెడ్డి పదవీ కాలం పూర్తి అవుతున్న నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంలో రెండవ ప్రెస్ అకాడమి చైర్మన్ గా కొమ్మినేని శ్రీనివాసరావు నియమితులు అయ్యారు. ప్రెస్ అకాడమి చైర్మన్ గా కొమ్మినేని నియామకం పట్ల పలువురు నేతలు, ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు.