“వైసీపీలో సీఎం జగన్ పట్టు తప్పుతోందా ? “ ఈ మాట వినడానికి ఆశ్చర్యమే కాకుండా అబద్దం అన్నట్లుగా ఉంది కానీ…ఇప్పుడు పరిణామాలు విపక్షాలు ఇదే కామెంట్ చేసే చాన్స్ ఇస్తున్నాయి.
జగన్ ప్రేమకు ఫలితం
తాను తీసుకున్న నిర్ణయం కారణంగా నిర్వాసితులకు ఇబ్బంది కలిగి ఉంటుందని, తానేదైనా ఇబ్బంది కలిగించి ఉంటే తనను మన్నించాలని సీఎం వైఎస్ జగన్ గండికోట నిర్వాసితులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది కడప జిల్లాపై జగన్ కు ఉన్న ప్రేమ. అలాంటి సమయంలో ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన కడప జిల్లా వైసీపీలో వర్గపోరు రాజుకుంది. నువ్వెంతంటే నువ్వెంతంటూ ఒకరిపై మరొకరు రాళ్లు, కత్తులతో దాడిక పాల్పడ్డారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి జిల్లాలో ఇలా జరిగిందే …. ఇంకేముంది విపక్షలకు అదో చాన్స్ కదా!
ఎందుకీ రచ్చ ?
కడపలో కలకలానికి కారణం ఆసక్తికరం . కడపజిల్లా కమాలాపురం నియోజకవర్గం వీరపనాయునిపల్లి (మం) పాయసంపల్లి వైసీపీలో వర్గపోరు రాజుకుంది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసే విషయమై తలెత్తిన వివాదం కాస్తా ముదిరి కాల్పుల దాకా వరకు వెళ్లింది. ఫైరింగ్ లో ఐదుగురు అదే పార్టీ ఇరువర్గాలకు చెందిన వ్యక్తులు గాయపడ్డారు. గాయపడిన వారంతా ప్రస్తుతం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఎవరెవరు ?
పాయసం పల్లికి చెందిన నిమ్మకాయల సుధాకర్ రెడ్డి అనే వైసీపీ నేత న్యూ ఇయర్ సందర్భంగా కేక్ కట్ చేసేందుకు సిద్దపడగా.. వైసీపీలోనే మరో వర్గానికి చెందిన మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి అందుకు అభ్యంతరం వ్యక్తం చేశారని సమాచారం. సుధాకర్ రెడ్డి పాయసం పల్లి గ్రామానికి చెందిన వాట్సాప్ గ్రూపులో నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడం నచ్చని మహేశ్వర్ రెడ్డి అతన్ని వారించాడు. హిందువులకు సంబంధించి ఉగాది పండుగ జరుపుకోవాలని ఇలా న్యూ ఇయర్ ఎందుకు జరుపుకుంటున్నారంటూ వాగ్వివాదానికి దిగడంతో అసలు గొడవ మొదలైంది. సుధాకర్ రెడ్డి ఈ రోజు ఉదయం కేక్ కట్ చేయడానికి పూనుకోగా ప్రత్యర్థి వర్గం మొదట రాళ్ల దాడి చేసింది. తరువాత కత్తులతో దాడికి తెగబడ్డారు. అయితే మహేశ్వర్ రెడ్డి చేసిన దాడిని ఆపేందుకు సుధాకర్ రెడ్డి తన వద్ద గల లైసెన్డ్స్ తుపాకీతో గాల్లోకి రెండు రౌండ్లు కాల్చాడు. ఈ క్రమంలో ఇరు వర్గాలకు చెందిన ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారందరినీ ప్రొద్దుటూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ గాయపడిన వారికి చికిత్స అందుతోంది. విషయం తెలుసుకుని గ్రామంలో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. సహజంగానే ఈ ఘటనలను చూసిన విపక్షాలు సోషల్ మీడియాలో వైసీపీపై ట్రోలింగ్ చేస్తున్నారు. జగన్ ను టార్గెట్ చేస్తున్నారు.