YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకా కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ వివేకా కుమార్తె సునీతారెడ్డి వేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు ఇవేళ విచారించింది. సునీత రెడ్డి వేసిన పిటిషన్ పై సీబీఐకి నోటీసులు ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ జారీ చేసిన ముందస్తు బెయిల్ ను సవాల్ చేస్తూ సునీతా రెడ్డి వేసిన పిటిషన్ లో సీబీఐకి నోటీసులు జారీ చేయాలని కోరినా… సుప్రీం కోర్టు అంగీకరించలేదు. ఇవేళ సుప్రీం కోర్టు వెకేషన్ బెంచ్ సీనియర్ న్యాయవాదాలు వాదనలు వినమని చెప్పడంతో తానే వాదనలు వినిపిస్తానంటూ స్వయంగా సునీత ముందుకు వచ్చారు.
తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డికు ముందస్తు బెయిల్ ఇచ్చే సమయంలో పలు అంశాలను పరిగణలోకి తీసుకోలేదని సునీతా రెడ్డి పేర్కొన్నారు. సీబీఐ సేకరించిన సాక్షాలను పరిగణలోకి తీసుకోలేదని చెప్పారు. అత్యున్నత న్యాయస్థానం చెప్పిన అంశాలకు విరుద్దంగా అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరైందని తెలిపారు. అవినాష్ రెడ్డి సీబీఐ దర్యాప్తునకు ఏ మాత్రం సహకరించడం లేదని, మూడు సార్లు నోటీసులు ఇచ్చినా ఆయన సీబీఐ ఎదుట హజరు కాలేదని తెలిపారు.
మొత్తం పరిణామాల నేపథ్యంలోనే అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతున్నామని సునీతారెడ్డి తెలిపారు. అవసరమైతే సీబీఐ నేరుగా సుప్రీం కోర్టుకు ఆశ్రయించేది కదా అని సుప్రీం కోర్టు ప్రశ్నస్తూ సీబీఐకి నోటీసులు ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ కేసులో సాంకేతిక అంశాలు ముడిపడిన నేపథ్యంలో న్యాయవాదిని నియమించుకోవాలని సునీతా రెడ్డికి సుప్రీం కోర్టు సూచించింది. అనంతరం కేసు విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది ధర్మాసనం.