Kuppam Municipality: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం మున్సిపల్ ఎన్నికలు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య హాట్ హాట్ గా మారింది. 14వ వార్డు టీడీపీ అభ్యర్ధి నామినేషన్ విత్డ్రా చేసుకోకపోయినా వైసీపీ అభ్యర్థిని అధికారులు ఏకగ్రీవంగా ప్రకటించారని ఆరోపిస్తూ టీడీపీ నేతలు మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు కార్యాలయంలోకి ప్రవేశించి అద్దాలను పగులగొట్టి ఫర్నీచర్ ను విసిరివేశారు. మున్సిపల్ సిబ్బంది వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించగా తీవ్ర వాగ్వివాదం జరిగింది. టీడీపీ నేతలను కార్యాలయంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.
Kuppam Municipality: ఫర్నీచర్ ధ్వంసం చేసిన టీడీపీ శ్రేణులు
విషయంలోకి వెళితే.. టీడీపీ మాజీ మంత్రి అమర్నాధ్ రెడ్డి, చంద్రబాబు పీఏ మనోహర్ లు మున్సిపల్ కార్యాలయంలో సాయంత్రం ఏడు గంటలైనా పోటీలో ఉన్న అభ్యర్ధుల జాబితా ప్రకటించకపోవడంపై వారు కార్యాలయానికి చేరుకుని కమిషనర్ ను జాబితా ప్రకటించాలని కోరారు. తమ పార్టీ నుండి 14వ వార్డు అభ్యర్ధి పోటీలో ఉన్నప్పటికీ ఆ వార్డు వైసీపీకి ఏకగ్రీవం అయినట్లు అధికారులు తెలియజేయడంతో వారు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. కొందరు టీడీపీ కార్యకర్తలు ఆగ్రహంతో అద్దాలు పగులగొట్టి ఫర్నీచర్ విసిరివేశారని అంటున్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద కు పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు రావడంతో గేటు వద్దనే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మున్సిపల్ కార్యాలయం గేటు బయట టీడీపీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. పార్టీ అధినేత చంద్రబాబుకు అక్కడి పరిస్థితిని అమర్నాధ్ రెడ్డి ఫోన్ ద్వారా వివరించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు మంగళవారం కుప్పం వెళ్లే అవకాశం ఉదంని వార్తలు వస్తున్నాయి.
అధికారుల తీరుపై అమర్నాధ్ రెడ్డి ఆగ్రహం
మరోవైపు కుప్పం మున్సిపల్ అధికారులపై మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల అధికారులు, ఆర్ ఓ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెంట వాలంటీర్లు, అధికారులు పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబును గుండెల్లో పెట్టుకుని కుప్పం ప్రజలు ఎన్నికల్లో వైసీపీకి తగిన గుణ పాఠం చెబుతారని అన్నారు.
ఎత్తులు పై ఎత్తులు
14వ వార్డు అభ్యర్ధి విషయంలో నిన్న హై డ్రామా నడిచింది. 14వ వార్డు నుండి టీడీపీ అభ్యర్ధులుగా వెంకటేశ్, ప్రకాశ్ నామినేషన్ పత్రాలు దాఖలు చేయగా వెంకటేశ్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. వైసీపీ అభ్యర్ధితో పాటు టీడీపీ అభ్యర్ధిగా ప్రకాష్ మాత్రమే పోటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశ్ కుటుంబంతో సహా అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో ప్రకాశ్ సోదరుడు గోవిందరాజు నిన్న ఉదయం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి అమర్నాధ్ రెడ్డి, చంద్రబాబు పీఏలు తమ సోదరుడి కుటుంబాన్ని కిడ్నాప్ చేశారంటూ ఫిర్యాదు చేశారు. అయితే సాయంత్రానికి తమను ఎవరూ కిడ్నాప్ చేయలేదంటూ ప్రకాశ్ కుటుంబ సభ్యులు వీడియో విడుదల చేశారు. దీంతో ఈ వివాదం సద్దుమణిగింది. ఈ మున్సిపాలిటీని అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ప్రతిష్టాత్మకంగా భావించి ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఇరు పార్టీల నేతలు కుప్పంలో మకాం వేయడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. కుప్పం మున్సిపాలిటీలో ఈ నెల 15వ తేదీ పోలింగ్ జరగనున్నసంగతి తెలిసిందే.