TDP: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులకూ ప్రభుత్వానికీ మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. కొత్త పీఆర్సీ అమలుపై ప్రభుత్వం ఇచ్చిన జీవో వీరిద్దరి మధ్యా పెద్ద అగాధాన్నే సృష్టించబోతోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్త ఆందోళనలతో ఉద్యోగులు రోడ్డెక్కారు.. కలెక్టరేట్ల ముట్టడి కూడా జరుగుతోంది. పాదయాత్రలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వానికి ఈ నిరసన ఊహించినదే అని చెప్పాలి. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం అటు సంక్షేమ పధకాలకు కూడా న్యాయం చేయాల్సి ఉండటంతో తప్పని పరిస్థితి. అయితే.. ఈ పరిణామాలపై ప్రతిపక్ష టీడీపీ అధిష్టానం, చంద్రబాబు నిశితంగా గమనిస్తున్నారనే చెప్పాలి. అందుకే ఉద్యోగుల నిరసనపై ఎక్కడా వారి కామెంట్లు వినపడటం లేదు.
చంద్రబాబు అలా చేసినా..
ఉద్యోగులతో పరిస్థితులు ఎలా ఉంటాయో 14 ఏళ్లు సీఎంగా పని చేసిన (TDP) చంద్రబాబుకు బాగా తెలుసు. 2004లో టీడీపీ ఓటమికి ఉద్యోగుల పట్ల చంద్రబాబు అవలంబించిన కఠిన విధానమే ఇందుకు కారణం. ‘నేను నిద్రపోను.. ఉద్యోగులను నిద్రపోనివ్వను’ అనే కామెంట్లు.. ఆయనకు అధికారాన్ని దూరం కావడానికి ఓ కారణమని చెప్పాలి. అందుకే 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ కంటే ఒక శాతం ఎక్కువ ఫిట్ మెంట్ ప్రకటించారు. రాజధానిని అమరావతికి మార్చిన తర్వాత అయిదు రోజుల పనిదినాలు.. హైదరాబాద్ వెళ్లే వారి కోసం సమయంలో వెసులుబాటు కల్పించారు. అయినా.. 2019లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. ఇందుకు ఉద్యోగులే కారణం కాకపోయినా.. ఉద్యోగులతో ఏ ప్రభుత్వమైనా ఫ్రెండ్లీగా వ్యవహరిస్తుంది. ఇటివల ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.
ఉద్యోగులు ఆలోచిస్తారా..
ఇప్పుడు ఉద్యోగుల ఉద్యమాలతో (TDP) టీడీపీ శ్రేణులు ఒకింత సంబరంగా ఉన్నాయని చెప్పాలి. గతంలో తామెంత చేసినా ఇంకా ఏదో ఆశించి జగన్ కు మద్దతిచ్చారని అనుకుంటారనే అనుకోవాలి. ప్రస్తుత పరిస్థితులను బేరీజు వేసుకుని వచ్చే ఎన్నికల్లో ఉద్యోగులు తమకే మద్దతిస్తారని.. వారి ఓటు బ్యాంకు తమకే అని ఆలోచిస్తారనడంలో సందేహం లేదు. ప్రస్తుత పీఆర్సీ విధానంతో రేపు తామంటూ అధికారంలోకి వస్తే ఉద్యోగులు ఇలా డిమాండ్ చేసే పరిస్థితులు ఉండవని కూడా భావిస్తూ ఉండొచ్చు. దీనినిబట్టి.. ప్రస్తత పరిస్థితులతో టీడీపీ.. హ్యాపీనా..? ఏమో..!