Pocharam Srinivas Reddy: కరోనా తగ్గుముఖం పట్టింది.. వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తి అయ్యాయి కదా.. ఇక భయపడనవసరం లేదు అన్నట్లు సాధారణ ప్రజానీకం మొదలు కొని ప్రముఖుల వరకూ ఎక్కడా కోవిడ్ నిబంధనలు పాటించడం లేదు. భౌతిక దూరం పాటించడం లేదు. మాస్కులు ధరించడం లేదు. ఇంకా కరోనా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. పలు జాగ్రత్తలు పాటిస్తున్న ప్రముఖులూ కరోనా బారిన పడుతూనే ఉన్నారు. ఇటీవల ఏపి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కరోనా బారిన పడి కోలుకున్నారు. ఇప్పుడు తాజాగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఏఐజీలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని వివరించారు. వైద్యుల సూచనల మేరకు ఆసుపత్రిలో చేరినట్లు పోచారం తెలిపారు.
Pocharam Srinivas Reddy: ప్రముఖుల్లో గుబులు
తనకు కరోనా పొజిటివ్ నిర్ధారణ అయ్యిందని పేర్కొన్న పోచారం.. తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గత ఆదివారం పోచారం మనుమరాలి వివాహ వేడుక హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసిఆర్, వైఎస్ జగన్మోహనరెడ్డితో సహా ఇరు రాష్ట్రాలకు చెందిన అనేక మంది ప్రముఖులు హజరైయ్యారు. ఏపి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్, తెలంగాణ మంత్రులు ఎమ్మెల్యేలు, వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఇతర ప్రముఖులు హజరై వధూవరులను ఆశీర్వదించారు. పోచారంకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం మీడియా ద్వారా వెల్లడి కావడంతో ఆ వివాహ వేడుకకు హజరైన చాలా మందిలో గుబులు రేగుతోంది. లక్షణాలు ఉన్నా లేకున్నా ఆయనతో సన్నిహితంగా ఉన్న వారు అంతా ఇప్పుడు పరీక్షలు చేయించుకోవడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. పోచారం మనుమరాలి వివాహ వేడుకకు హజరైన చాలా మంది ప్రముఖులు మాస్కులు ధరించపోవడం గమనార్హం.