Telangana police: పోలీస్ పెట్రోలింగ్ వాహనంలో ఓ కానిస్టేబుల్ తెలంగాణ నుండి ఏపికి మద్యం అక్రమ రవాణా చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఏపిలో మద్యం ధరలు ఎక్కువగా ఉండటం, దానికి తోడు మందుబాబులు అలవాటు పడిన బ్రాండ్ లు లభించకపోవడంతో చాలా కాలంగా సరిహద్దు రాష్ట్రాల నుండి ఏపికి మద్యం అక్రమ రవాణా వ్యాపారం జోరుగా సాగుతోంది. రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ ఓ పక్క తెలంగాణ, మరో పక్క కర్నాటక, అటు తమిళనాడు రాష్ట్రాల నుండి సమీప ఏపి జిల్లాలకు మద్యం అక్రమ రవాణా జరుగుతోంది. దీంతో మద్యం వ్యాపారంతో కాసులు వెనకేసుకోవాలన్న ఆలోచన చేసిన తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లా వాడపల్లి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ శ్రావణ్ కుమార్ ఏపి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. సదరు కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్ పెట్రోలింగ్ వాహనంలో ఈ నెల 14వ తేదీ రాత్రి మద్యం సీసాల బాక్స్ లను ఏపికి తీసుకువచ్చాడు. పోలీస్ వాహనం కావడంతో సరిహద్దు చెక్ పోస్టు వద్ద అధికారులు తనిఖీ చేయలేదు.
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం రామాపురం అడ్డరోడ్డు వద్ద చెట్ల పొదల్లో సరుకును దించి తిరిగి పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి పెట్రోలింగ్ వాహనాన్ని అక్కడ నిలుపుదల చేశారు. తరువాత నరసరావుపేటకు చెందిన కోటేశ్వరరావుతో కలిసి శ్రావణ్ కుమార్ రామాపురం అడ్డరోడ్డు వద్దకు వచ్చాడు. అక్కడ కోటేశ్వరరావు కారులో మద్యం సీసాలను లోక్ చేస్తుండగా దాచేపల్లి పోలీసులు అకస్మాత్తుగా దాడి చేసి శ్రావణ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు రావడం పసిగట్టిన కోటేశ్వరరావు అక్కడి నుండి పరారైయ్యాడు. ఈ ఘటనపై దాచేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి శ్రావణ్ కుమార్ ను కోర్టుకు హజరుపర్చగా మెజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. పెట్రోలింగ్ వాహనంలో మద్యం సీసాల తరలింపుపై తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు స్టేషన్ సిబ్బంది పర్యవేక్షణ లోపం కారణంగానే ఇది జరిగిందన్న అభియోగంపై వాడపల్లి ఎస్ఐ డి విజయకుమార్ ను హైదరాబాద్ రేంజ్ ఐజీ ఎన్ శివశంకరరెడ్డి నేడు సస్పెండ్ చేశారు.