విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారి (ఎన్హెచ్ 65) పై వరద ప్రవాహం తగ్గింది. మున్నేటి వాగు ఉధృతితో ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం వద్ద జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహించడంతో గురువారం సాయంత్రం నుండి వాహనాల రాకపోకలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీంతో పలు వాహనదారులు ప్రత్యామ్యాయ మార్గాల ద్వారా వెళ్లగా, లారీలు, పలు ఇతర వాహనాలు రహదారి పక్కనే బారులు తీరాయి. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యారు.
శుక్రవారం సాయంత్రానికి వరద తగ్గుముఖం పట్టడంతో అధికారులు ఐతవరం వద్ద జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అనుమతించారు. ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా ఉండేందుకు గానూ తొలుత హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను అనుమచించారు పోలీసులు. జాతీయ రహదారిపై కొద్ది మేర వరద నీరు ప్రవహిస్తుండటంతో పోలీసులు దగ్గర ఉండి ఒక్కో వాహనాన్ని పంపుతున్నారు. దాదాపు 26 గంటల తర్వాత ఐతవరం వద్ద వాహనాల రాకపోకల పునరుద్దరణ జరిగింది.
నిన్న మధ్యాహ్నం నుండి వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ స్వచ్చంద సంస్థలు వాహనాలదారులకు అల్పాహారం, వాటర్ బాటిళ్లను అందించారు. మరో పక్క మున్నేటి వరదలో చిక్కుకున్న వ్యవసాయ కూలీలను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించి ఒడ్డుకు చేర్చారు. ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ అధికారులతో కలిసి సహాయక చర్యలను పర్యవేక్షించారు.
ఇద్దరు ఉన్నతాధికారులకు హైకోర్టు నోటీసులు .. విద్యాశాఖ మంత్రి బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు