తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి టిడిపి సీటు ఎవరికి ? దక్కుతుంది అనేదానిపై గత రెండు మూడు నెలలుగా పెద్ద సస్పెన్స్ నెలకొంది. వాస్తవంగా పొత్తుల భాగంగా ఈ సీటును జనసేన తీసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది. అలాగే బీజేపీ కూడా పొత్తులో ఈ సీటు కోసం విశ్వ ప్రయత్నాలు చేసినా చివరకు చంద్రబాబు గత ఎన్నికలలో ఓడిన టిడిపి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డికి కేటాయించారు. దివంగత మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడే సుధీర్ రెడ్డి గత ఎన్నికలలో పోటీ చేసి వైసిపి అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి చేతిలో ఘోరంగా పడిపోయారు. ఐదేళ్లపాటు నియోజకవర్గంలో అంత యాక్టివ్గా లేరు.
పార్టీలోను సుధీర్ రెడ్డి తీరును వ్యతిరేకించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా చంద్రబాబు తప్పని పరిస్థితుల్లో బొజ్జల ఫ్యామిలీ మీద ఉన్న గౌరవంతో సుధీర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. అయితే ఇప్పుడు సుధీర్ రెడ్డికి కమ్మటి షాక్ తగులుతోంది. నియోజకవర్గంలో కమ్మ నాయకుడు డాక్టర్ పోతుగుంట రాజేష్ నాయుడు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్టీ సీనియర్ నేత ..శ్రీకాళహస్తి బోర్డు మాజీ చైర్మన్ పోతుగుంట గురవయ్య నాయుడు తనయుడే రాజేష్ నాయుడు. ఈ కుటుంబం గోపాలకృష్ణారెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేది.
వాస్తవానికి గురవయ్య నాయుడు కుమారుడు డాక్టర్ రాజేష్ నాయుడు వైద్యుడిగా.. వ్యాపారవేత్తగా శ్రీకాళహస్తి పట్టణంలో మంచి పేరు తెచ్చుకున్నారు. నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో గుడ్విల్ తెచ్చుకున్నారు. ఆయన టిడిపి టికెట్ ఆశించారు. అయితే రాజేష్ నాయుడుకి బొజ్జల సుధీర్ రెడ్డి తో పాటు మాజీ ఎమ్మెల్యే ఎన్సివి నాయుడు నుంచి గట్టి పోటీ ఎదురైంది. అయితే చంద్రబాబు ఈ సీటును సుధీర్ రెడ్డికి కేటాయించారు. సుధీర్ కు సిటు విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాజేష్ నాయుడు టిడిపికి రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
టిడిపిలో ఎన్ని సంవత్సరాలు ఉన్నా గుర్తింపు ఉండదని సుధీర్ రెడ్డి అస్సలు ఎవరికి గౌరవం ఇవ్వటం లేదన్న విమర్శలు ఉన్నాయి. కేవలం రాజేష్ నాయుడు మాత్రమే కాదు.. అటు జనసేన నేతలు కూడా సుధీర్ రెడ్డికి సీటు ఇచ్చాక ఇప్పటివరకు తమను అసలు పట్టించుకోలేదని లబోదిబోమంటున్నారు. ఇక టీడీపీకి గుడ్ బై చెప్పిన రాజేష్ నాయుడు వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి పోటీ చేయనున్నారు. రాజేష్ నాయుడుకి శ్రీకాళహస్తి – తొట్టంబేడు – ఏర్పేడు మండలాల్లో కమ్మ సామాజిక వర్గంలో బలం ఉంది ఇప్పుడు రాజేష్ కాంగ్రెస్లో చేరటం టీడీపీకి కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి. అలాగే ఇటు కాంగ్రెస్కు రాజేష్ రూపంలో మంచి నాయకుడు దొరికినట్లు అయింది.