చిత్తూరు జిల్లాలో ఏనుగు బీభత్సం సృష్టించింది. గుడిపాల మండలంలో ఓ ఒంటరి ఏనుగు దాడిలో భార్యభర్తలు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు రామాపురం దళితవాడకు చెందిన వెంకటేశ్ (50), సెల్వి (48) గా గుర్తించారు. మరో వైపు సీకే పల్లికి చెందిన సుధాకర్ తోటలో ఏనుగు తిరుగుతుండటాన్ని గమనించిన బసవాపల్లి ఎస్సీ కాలనీకి చెందిన యువకుడు కార్తీక్ వెళ్లగా అతనిపై దాడి చేసి దంతాలతో పొడిచింది.
తీవ్రంగా గాయపడిన ఆ యువకుడిని వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కార్తీక్ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఏనుగు సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. స్థానికులు పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.
పది రోజుల క్రితం జిల్లాలోని పెద్దపంజాణి మండలంలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఏనుగు దాడిలో భార్యభర్తలు గాయపడగా, భర్త పరిస్థితి విషమించి మృతి చెందాడు. ముదిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన మార్కొండయ్య, అరుణమ్మ దంపతులు రోజు మాదిరిగానే పొలానికి వెళ్లి సాయంత్రం ఇంటికి వెళుతుండగా మార్గమధ్యలో ఏనుగు దాడి చేసింది. ఈ క్రమంలో భర్త మార్కొండయ్య కిందపడిపోయాడు. ఆ ఏనుగు ఆయనను కాలితో తొక్కడంతో మృతి చెందాడు.
YS Jagan: నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైఎస్ జగన్