TTD : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు మరో కీలక పదవి లభించింది. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి మరో సారి ఎమ్మెల్యేగా గెలిచిన మల్లాది విష్ణుకు జగన్ సర్కార్ ఏడాది క్రితం ఏపి బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ పదవి ఇచ్చింది. ఇప్పుడు తాజాగా మరో పదవి లభించింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు ప్రత్యేక ఆహ్వానితుడుగా విష్ణును నామినేట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక ఆహ్వానితుడైన మల్లాది విష్ణుకు టీటీడీ బోర్డు తీర్మానాల్లో ఓటింగ్ అర్హత ఉండదని ఉత్తర్వులో పేర్కొంది. టీటీడీ బోర్డు సభ్యులకు మాదిరిగా ప్రత్యేక ఆహ్వానితులకు ప్రోటోకాల్ వర్తిస్తుందని పేర్కొన్నది.
ఇప్పటికే టీటీడీ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితులుగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, రాకేష్ సిన్హా, ఏజి శేఖర్, కుపేందర్ , గోవింద హరి, దుష్మంత్ కుమార్ దాస్, ఆమోల్ కాలే ఉన్నారు. చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని టీటీడీ బోర్డులో ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిపి 28 మంది ఉండగా, ప్రత్యేక ఆహ్వానితులుగా విష్ణుతో కలిపి 8మంది అయ్యారు. దీంతో పాలకమండలి సభ్యుల సంఖ్య 36కు చేరుకున్నది.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున 2009లో తొలి సారి ఎమ్మెల్యేగా అయిన మల్లాది విష్ణు .. తర్వాత వైఎస్ సన్నిహితుడుగా గుర్తింపు పొందారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన విష్ణు 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావుపై విజయం సాధించారు. ఆ తరువాత ప్రభుత్వం ఆయనను బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ గా నియమించింది.