AP Cabinet Meet: ఏపీ కేబినెట్ భేటీకి ముహూర్తంగా ఖరారు అయ్యింది. ఈ నెల 15వ తేదీ సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
ఈ నెల 15న ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. తొలుత ఈ నెల 14న మంత్రివలర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించినా, 15వ తేదీకి మార్పు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి వెల్లడించారు. 15వ తేదీ ఉదయం 11 గంటలకు సచివాలయం మొదటి బ్లాక్ లోని కేబినెట్ సమావేశ మందిరంలో కేబినెట్ భేటీ జరుగుతుందని సీఎస్ ఉత్తర్వులో పేర్కొన్నారు. కేబినెట్ సమావేశంలో ప్రస్తావించే ప్రతిపాదనలను ఈ నెల 13వ తేదీ సాయంత్రం నాలుగు గంటల్లోపు అన్ని ప్రభుత్వ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు సమర్పించాలని సీఎస్ ఆదేశించారు.
ఇంతకు ముందు జరిగిన కేబినెట్ భేటీల్లో సీఎం విశాఖకు మారే అంశంపై చర్చించారు. డిసెంబర్ నెలాఖరులోగా తాను విశాఖకు వస్తానని కొద్ది నెలల క్రితం విశాఖ పర్యటనలో సీఎం జగన్ ప్రకటించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి పర్యటనల నేపథ్యంలో సీఎం, ముఖ్యశాఖల అధికారులు, మంత్రులు విశాఖలో బస చేసేందుకు అవసరమైన భవనాలను ప్రభుత్వం ఇప్పటికే సిద్దం చేసింది. మరోపక్క విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపును నిలిపివేయాలని దాఖలైన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతోంది. కార్యాలయాల తరలింపును నిలిపివేయాలని కోరుతూ రాజధాని పరిరక్షణ సమితి హైకోర్టు లో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
క్యాంపు కార్యాలయం ముసుగులో ప్రభుత్వ కార్యాలయాలు తరలిస్తున్నారని రాజధాని పరిరక్షణ సమితి పిటిషన్ లో పేర్కొంది. ప్రభుత్వ కార్యాలయాల తరలింపు పై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో కార్యాలయాలను ఇప్పటికిప్పుడే తరలించడం లేదని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్ ను త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపాలని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనాన్నికోరారు. ఈ మేరకు రిజిస్ట్రీలో దరఖాస్తు ఇచ్చినట్లుకోర్టు దృష్టికీ తీసుకువచ్చారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను 18వ తేదీకి వాయిదా వేసింది.
రాజధాని ఆఫీసులు ప్రస్తుతం తరలించడం లేదని, ఆఫీసులు తరలిస్తున్నట్లుగా జరుగుతున్న ప్రచారం అపోహ మాత్రమేనని ప్రభుత్వం హైకోర్టులో తెలిపింది. హైకోర్టులో విచారణ జరుగుతున్న తరుణంలో విశాఖలో సీఎం క్యాంప్ కార్యాలయం ఏర్పాటు అంశం కేబినెట్ లో చర్చకు వస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. పలు కీలక అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదం తెలుపనున్నారు.