మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసులో వరుస విచారణలు చేస్తున్నది. ఇవేళ అవినాష్ రెడ్డి విచారణకు హజరు కావాల్సి ఉండగా, తనకు ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉండటం వల్ల హజరు కాలేకపోతున్నాననీ, మూడు నాలుగు రోజులు సమయం కావాలని కోరుతూ లేఖ రాశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీబీఐ ఈ నెల 19వ తేదీన విచారణ కు రావాలంటూ నోటీసులు ఇచ్చింది. మరో పక్క అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరులుగా భావిస్తున్న నాగళ్ల విశ్వేశ్వరరెడ్డి, వర్రా రవీంద్ర రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి లను ఇవేళ సీబీఐ కార్యాలయానికి పిలిపించి విచారణ చేశారు. అంతే కాకుండా వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి లను ఇవేళ విచారణ చేశారు.
ఇంతకు ముందు రెండు సార్లు ఈ ఇద్దరు సీబీఐ ఎదుట హజరు కాగా, తాజాగా మరో సారి విచారణకు రావడంతో ఉత్కంఠ నెలకొంది. విచారణ ప్రక్రియ మొత్తాన్ని సీబీఐ అధికారులు మొదటి నుండి రికార్డింగ్ చేస్తున్నారు. ఇవేళ కూడా సునీత, రాజశేఖరరెడ్డి స్టేట్ మెంట్ లను సీబీఐ నమోదు చేసింది. ప్రధానంగా వివేకా రాసిన లేఖ కు సంబంధించి ప్రశ్నలు అడిగి సమాధానాలు సేకరించినట్లు గా తెలుస్తొంది. ఘటనా స్థలంలో దొరికిన లేఖను వెంటనే పోలీసులకు అందజేయకుండా, ఆలస్యంగా ఇవ్వడానికి కారణాలు ఏమిటి అనే దానిపై ఆరా తీసినట్లుగా తెలుస్తొంది.
సీబీఐ అధికారులు వ్యక్తి టార్గెట్ గా విచారణ జరుపుతున్నారని అవినాష్ రెడ్డి ఇంతకు ముందు ఆరోపించారు. వివేకా సూసైడ్ నోట్, వివేకా రెండో భార్య వ్యవహారం, కుటుంబంలో ఆస్తుల వివాదం తదితర విషయాలను ఎందుకు పరిశీలన చేయడం లేదంటూ అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో సీబీఐ సిట్ బృందం అన్ని కోణాల్లోనూ దర్యాప్తును వేగవంతం చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు జూన్ 20వ తేదీ నాటికి విచారణ పూర్తి చేయాల్సి ఉండటంతో దర్యాప్తు ప్రక్రియలో సీబీఐ వేగం పెంచింది.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై మరో సారి ఘాటు వ్యాఖ్యలు చేసిన సీఎం వైఎస్ జగన్