కేసులు భయంతోనే పార్టీ మార్పు..మాజీ మంత్రి..టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ వైసీపీలోకి వస్తున్నారంటూ కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.
ఇందు కోసం పలు ముహూర్తాలు ప్రచారంలోకి వచ్చాయి. ఎన్నికల ముందే గంటా తన టీంతో కలిసి వైసీపీలోకి వస్తారనే వాదన వినిపించింది. అయితే, ఆయనతో అప్పటి వరకు కలిసి ఉన్న అవంతి మాత్రం వైసీపీలోకి వచ్చారు. ఆ రోజు నుండే గంటాను అవంతి ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు. ఇప్పుడు విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన తరువాత టీడీపీలో విశాఖ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు ఎమ్మెల్యేల్లో ఒక్కరు మినహా ముగ్గురు వైసీపీతో జత కట్టేందుకు సిద్దంగా ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే, గంటా రాకను మంత్రి అవంతి తో పాటుగా వైసీపీ కీలక నేత విజయ సాయిరెడ్డి సైతం అడ్డుకుంటున్నారంటూ మరో వాదన వినిపిస్తోంది.
అయితే, కొందరు పార్టీ నేతల జోక్యంతో ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఇదే సమయంలో మంత్రి అవంతి ఓపెన్ అయ్యారు. గంటా రాక గురించి మనసులో మాట చెప్పేసారు. మంత్రి హోదాలో ఉంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. అయితే, ఇదే సమయంలో ఈ నెల 16న గంటా మరి కొంత మంది టీడీపీ నేతలతో కలిసి సీఎం జగన్ ను కలవనున్నట్లు విశ్వసనీయ సమాచారం.గంటా రాక పై అవంతి క్లారిటీ…ప్రజారాజ్యం నుండి గంటా ..అవంతి ఒక్కటిగా ఉన్నారు. ఇద్దరూ 2009లో ప్రజారాజ్యం నుండి ఎమ్మెల్యేలుగా గెలిచారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం తరువాత కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో గంటా మంత్రి గా పని చేసారు.
ఇక, రాష్ట్ర విభజన తో గంటా..అవంతి సహా వారి టీం 2014 ఎన్నికల సమయంలో టీడీపీలో చేరింది. కాగా, 2014 ఎన్నికల్లో గంటాకు ఎమ్మెల్యేగా..అవంతి తప్పని పరిస్థితుల్లో అనకాపల్లి ఎంపీగానూ పోటీ చేయాల్సి వచ్చింది. ఇద్దరూ గెలిచారు. గంటా టీడీపీ హాయంలో చంద్రబాబు కేబినెట్ లో విద్యా శాఖ మంత్రి అయ్యారు. 2019 ఎన్నికల ముందు వరకూ అవంతి టీడీపీలోనే కంటిన్యూ అయినా..చివరకు వైసీపీలో చేరారు. ఆ సమయం నుండే తనకు గంటా మీద ఉన్న ఆక్రోశం మొత్తం వెల్లగక్కటం ప్రారంభించారు. తనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పిస్తానని చెప్పి..తన స్థానంలో గంటా ఎమ్మెల్యే టిక్కెట్ తెచ్చుకొని తనను బలవంతంగా ఎంపీగా బరిలోకి దింపారంటూ చెప్పుకొచ్చారు. ఇక, మంత్రిగా గంటా అవినీతి పైనా పలు ఆరోపణలు చేసారు.
తాజాగా గంటా వైసీపీలోకి రాక పైనా ఆయన స్పందించారు. తన పైన ఉన్న కేసుల నుండి తప్పించుకొనేందుకే గంటా దొడ్డి దారిలో వైసీపీలోకి వచ్చే ప్రయత్నం చేస్తన్నారని పరోక్షంగా గంటా వైసీపీలోకి వస్తున్న విషయాన్ని చెప్పకనే చెప్పేసారు. అధికారం లేకుండా గంటా ఉండలేరని.. అధికారం ఎక్కడ ఉంటే అక్కడకు గంటా వచ్చస్తారంటూ మంత్రి అవంతి ఫైర్ అయ్యారు.16న ముహూర్తం ఫిక్స్…కలిసి వచ్చేదెవరు..పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డి..మంత్రి అవంతికి ఇష్టం లేకపోయినా విశాఖలో టీడీపీని దెబ్బ తీయాలంటే గంటాను పార్టీలో చేర్చోవాలని వైసీపీ అధినాయకత్వం భావించినట్లుగా తెలుస్తోంది. ఇందు కోసం గతంలో గంటాతో సహచర మంత్రిగా పని చేసిన ప్రస్తుత మంత్రి..అదే విధంగా మరో ఇద్దరు సీనియర్ నేతలు నేరుగా ముఖ్యమంత్రితో రాయబారాలు నడిపినట్లు సమాచారం.
విశాఖలో కార్పోరేషన్ ఎన్నికలు సైతం ఎదుర్కోవాల్సిన సమయంలో గంటా అండ్ కో వైసీపీలోకి వస్తే మరింత బలం పెరుగుతుందని వారు సీఎంకు వివరించినట్లుగా చెబుతున్నారు. దీంతో..విశాఖలో వైసీపీ అభ్యర్ధి మేయర్ పీఠం దక్కించుకోనే లా అన్ని ఆర్దిక వ్యవహారాలు గంటానే చూసుకోవాలని పార్టీ నేతలు షరతు పెట్టినట్లుగా ప్రచారం సాగుతోంది. దీంతో..ఈ నెల 16న ముఖ్యమంత్రిని కలిసి ఇక వైసీపీతోనే అడుగులు వేసేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే, గంటాతో పాటుగా టీడీపీలో ఉన్న మరి కొంత మంది నేతలు సైతం జగన్ ను కలుస్తారని చెబుతున్నారు. అయితే, గంటా వియ్యంకుడు నారాయణ సైతం వైసీపీలోకి వస్తారా లేక ఆయన మరి కొంత కాలం నిరీక్షిస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది.