ఇప్పుడు అందరూ సోనూ గురించి మాట్లాడుతున్నారు… చిరంజీవి గురించి, బాలకృష్ణ గురించి… ప్రభాస్, మహేశ్ గురించి ఎందుకు మాట్లాడటం లేదు… అవును వీరంతా దేశం గర్వించే సినీతారలు.
వీరేకాదు ఇంకా టాలీవుడ్, బాలీవుడ్ బాద్షాలు చాలా మందే ఉన్నారు. వాళ్లంతా కూడా కోట్లాదిపతులు. వారందరికీ సమాజం పట్ల గర్వం, గౌరవం రెండూ ఉంటాయ్. కానీ అవసరానికి మాత్రం వారు ముందుకు రారు. ఎందుకంటే వారికి సమాజం నుంచి తీసుకోవడమే తెలుసా… అన్న అనుమానం కలుగుతోంది. ఊరికి ఇవ్వకుంటే బలిసిపోతామంటూ సినిమాల్లో డైలాగులు మాత్రం ఊకదంపుడుగా చాలా చెప్పేస్తారు. సందర్భం ఉన్నా లేకున్నా… తమ నోటికి పవర్ ఫుల్ గా వచ్చేలా మాటల తూటాలు పేలుతారు. కానీ సమాజానికి ఇంత ఆపత్కాలంలో సాయం చేయడానికి మాత్రం వారు ముందుకు రావడం లేదు.
అందరూ సోనూ సూద్ను అభినందిస్తున్నారు. ఆయన అలా చేశాడని… ఇలా చేశాడని… ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయన చేస్తున్న సాయం విలువ తెలిసి కూడా ఎవరూ స్పందించడం లేదు. ప్రభుత్వాలు చేసే మేళ్లు చేస్తూనే ఉన్నాయ్. కానీ కోట్లకు పడగలెత్తిన మన పెద్ద సార్లూ మాత్రం మాటలకే పరిమితమైపోయారు. కోట్లాది రూపాయలు పోగేసుకొని ఏం చేసుకుంటామన్న స్పృహ కూడా వీరికి లేదు. సాయం అవసరమున్నోడికే సాయం విలువ తెలుస్తుంది. వీరికి ఎవరి సాయం అవసరం లేదట్టుంది అందుకే వీరెవరూ కూడా స్పందించడం లేదు. కరోనా సమయంలో సినీ కార్మికుల కోసం సాయం చేసిన సినీ పెద్దలు… సామాన్యుడు లేకుంటే వారి సినిమాలు ఎవరూ చూస్తారు. రేపోమాపో సినిమా హాళ్లు కూడా ఓపెన్ కాబోతున్నాయ్. కరోనాతో చస్తూ బతుకుతున్న సామాన్యులు రేపు సినిమా హాళ్లకు వచ్చి వీరి సినిమాలను జయప్రదం చేయాలి కామాలి. తెలుగు నేలపై ఇప్పుడు ఉద్యోగాలు లేక, జీవనోపాధి కరువు, కరోనాతో జనం బెంబేలెత్తిపోతున్నారు. చిరంజీవి సామాజిక స్పృహ గురించి ప్రశ్నించాలన్న ఉద్దేశం ఇక్కడ ఎవరికీ లేదు. కానీ… ఆయన చేయాల్సింది చాలా ఉంది. ఇంకా ఏం సాధిస్తారు. జనం మరచిపోలేని సేవలు చేయవచ్చు. ఆయన కోడలు అపోలో ఆసుపత్రి భాగస్వామిగా ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అపోలో సేవలు చాలానే అవసరం ఉంది. కార్పొరేట్ ఆగడాలను అడ్డుకునేందుకు ఎవరూ సాహసించడం లేదు.
జనం చస్తుంటే ఆ ఆసుపత్రి, ఈ ఆసుపత్రి అని కాకుండా యధేచ్ఛగా దోచేసుకుంటున్నాయ్. ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషిస్తుంది. కేసీఆర్ గతంలో చెప్పినట్టుగా కరోనా తప్పుడు ప్రచారం చేసేవాళ్లకు కరోనా వస్తుందన్నట్టుగా… ప్రజలను మోసం చేస్తున్నవాళ్లకు కూడా ఎందుకు రాదని ప్రశ్నించాల్సి ఉంది. ఇక బాలయ్య స్వయంగా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి బాధ్యతలు చూస్తున్నారు. ఆయన తలచుకుంటే ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి మరీ ప్రజలకు సేవ చేసే అవకాశం సుస్పష్టం. ఆయన తలచకుంటే కార్పొరేట్ ఆసుపత్రులు బాధ్యతలను గుర్తుచేయగల సత్తా ఉన్న మనిషి. మహేశ్, ప్రభాస్ ఇప్పుడు దేశం గర్వించదగ్గ హీరోలు. వారు ఇప్పుడు కరోనా వారియర్స్ గా ఎందుకు ముందుకు రారు. వారంతా ప్రజలకు మేమున్నామన్న సపోర్ట్ ఇస్తే అది సమాజానికి ఎంతో మేలు చేస్తుంది కదా… ఆ బాధ్యత లేదా వీరికి… ఆసుపత్రులు కోట్లను పోగేసుకునే పనిలో పడితే… అందుకు రాజకీయ శక్తులన్నీ సపోర్ట్ చేయడం ఈ విషాదాంతానికి పరాకాష్ట.
ఇప్పుడు అందరి ముందు ఉన్న లక్ష్యం ఒక్కటే. కరోనాతో ఒక్కరు కూడా చనిపోకుండా కాపాడటం. ఆ లక్ష్యానికి సమాజంలోని అన్ని వర్గాల పెద్దలు చేతులు కలపాల్సి ఉంది. పాలకులు చేయూత అందించడానికి సిద్ధమవ్వాలి. ఒకరికొకరు ఉంటేనే కదా సమాజం. ఆ సమాజం ఉండాలంటే వీళ్లందరూ కళ్లు తెరవాలి. అలా కాని పక్షంలో ప్రజలు తగిన గుణపాఠం కచ్చితంగా చెబుతారు. కాకుంటే కొంచెం టైమ్ పడుతుంది.