రెండు నెలల కిందట నిప్పు అంటింది. సైలెంట్ గా నివురుగా కాలుతుంది. ఇంకా రగలలేదు. కానీ రగిలే అవకాశాలు బీజేపీ చేతిలోకి వెళ్లాయి. రగులుస్తుందా..? అలాగే నివురుగా లోలోపల ఉంచుతుందా..? చల్లార్చుతుందా అనేది ప్రస్తుతానికి అస్పష్టమే..!
జస్టిస్ ఎన్వీ రమణపై అనేక ఆరోపణలు, ప్రాధమిక ఆధారాలతో ఏపీ సీఎం జగన్ రాసిన లేఖ రగిల్చిన వేడి ఇంకా ఢిల్లీలో కదులుతుంది. లేఖ రాసి రెండు నెలలు కావస్తుంది. “న్యూస్ ఆర్బిట్” ముందే చెప్పినట్టు ఈ లేఖ అటు బీజేపీకి, ఇటు జగన్ కి.. మధ్యలో జస్టిస్ రమణకి కూడా లాభమో, నష్టమో చేకూర్చేదే అవుతుంది. జగన్ కి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లలో కొన్నిటిని సుప్రీం కోర్టు నిన్న కొట్టేసింది. అంటే జగన్ కి ఊరట ఇచ్చినట్టు కాదు, అలా అని ఇరికించినట్టు కాదు. వివాదాన్ని ఇంకా తన చేతిలో పెట్టుకుంది. పట్టుకుని ఉంచింది. ఎటు తిప్పుతుందో త్వరలోనే తేలనుంది..!
కొట్టేసినవి ఇవీ.. తేలాల్సినవి ఉన్నాయి..!!
సీఎం జగన్ కి వ్యతిరేకంగా సుప్రీం లో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిలో చాలా అంశాలు ఒకే విధంగా ఉండడంతో కొన్నిటిని సుప్రీం నిన్న కొట్టేసింది. కానీ ఒక్క పిటిషన్ ని మాత్రం విచారణకు స్వీకరించింది. జగన్ ని సీఎం పదవి నుండి తొలగించాలి అంటూ ఇద్దరు న్యాయవాదులు అత్యుత్సాహంతో వేసిన పిటిషన్లు సుప్రీం కొట్టేసింది. లేఖ రాసిన అంశానికి సీఎం పదవి నుండి తొలగించడానికి సంబంధం లేదు. పైగా సిబిఐ దర్యాప్తు జరపాలా వద్దా..? అనేది సుప్రీం చీఫ్ జస్టిస్ నిర్ణయం తీసుకుంటారు. అందుకే ఈ రెండు అంశాలపై దాఖలైన పిటిషన్లు పోయినట్టే. ఇక మిగిలింది ఒక్కటే. సునీల్ కుమార్ సింగ్ వేసిన కీలక పిటిషన్ పై ఏ విషయమూ తేలాల్సి ఉంది. “దీనిలో నాణేనికి రెండు వైపులా అంశాలున్నాయి. “సీఎం జగన్ ఇలా లేఖ రాయడం విరుద్ధం కాబట్టి అతనిపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని.., అదే సమయంలో ఈ లేఖలో ఉన్న అంశాలపై పూర్తిస్థాయిలో విచారణ కూడా జరిపించాలి” అనీ ఈ పిటిషన్ లో పేర్కొన్నారు. ఇది అన్ని రకాలుగా బ్యాలన్సుడ్ గా ఉండడంతో విచారణకు స్వీకరించారు. ఇక్కడే కొన్ని ట్విస్టులున్నాయి.
బీజేపీ చేతిలోనే బొమ్మలు..!!
“న్యూస్ ఆర్బిట్” మొదట్లోనే చెప్పినట్టు సీఎం జగన్ లేఖ రాయడం.., జస్టిస్ రమణతో కయ్యానికి పూనుకోవడం వెనుక బీజేపీ ఉంటె ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు..! కానీ బీజేపీ హస్తం ఉంటె విషయం ఒక మలుపు తిరుగుతుంది, లేకపోతే విషయం మరోలా ఉంటుంది. బీజేపీకి కావాల్సింది ఉదయ్ ఉమేష్ లలిత్ అనే జడ్జి చీఫ్ జస్టిస్ అవ్వడం. ఎంత త్వరగా అయితే అంత మంచిది. జగన్ కి కావాల్సింది రమణ చీఫ్ జస్టిస్ కాకపోవడం. అంటే రెండు ఉద్దేశాలు ఒకటే. కానీ.. రమణ చీఫ్ జస్టిస్ చేయకూడదు అని బీజేపీ ఏమి కంకణం కట్టుకుని లేదు. అందుకే రమణ విషయంలో బీజేపీ ద్వంద్వ ఉద్దేశాలతో వ్యవహరించే అవకాశాలు లేకపోలేదు. అంటే జగన్ రాసిన లేఖని కూడా బీజేపీ ద్వంద్వ ఉద్దేశాలతో ఉపయోగించుకునే అవకాశాలు లేకపోలేదు. జగన్ అనుకున్నట్టు ఈ లేఖ ఆధారంగా జస్టిస్ రమణపై విచారణకు ఆదేశించినా.., చీఫ్ జస్టిస్ కాకుండా చేసినా జగన్ గెలిచినట్టే. అది కూడా బీజేపీకి రాజకీయంగా నష్టమే. అప్పుడు జగన్ చేయి దాటిపోతారు. అందుకే ఈ లేఖ, ఆ జడ్జి, ఈ జగనూ అందరూ బీజేపీ ఆడించిన విధంగా, కాలానుగుణంగా ఆడాల్సిందే. సో.. ప్రస్తుతానికి జగన్ కి వ్యతిరేకంగా దాఖలైన కొన్ని పిటిషన్లు కొట్టేసినా.. కీలకమైనది ఉంది.