50 వేల దుకాణాలు మూతబడ్డాయి..!
10 వేల కార్యాలయాలు శాశ్వతంగా మూతబడ్డాయి..!
400 హోటళ్లు మూతబడ్డాయి. మరో 300 హోటళ్లు అమ్మకానికి వెళ్లాయి..!
300 ప్లే స్కూళ్ళు మూతబడ్డాయి..!!
వీటి ప్రభావం ఆర్ధికంగా చూసుకుంటే దాదాపు రూ. 5 వేల కోట్ల నష్టం.
ఇది ఒక్క బెంగుళూరు నగరంలో కరోనా కల్లోలం లెక్క…!
హైదరాబాద్ లోనూ దాదాపుగా 3 వేల కోట్ల విలువైన సంపద ఆవిరైంది. ఇది మొత్తం మధ్యతరగతిదే. రెక్కల కష్టం నమ్ముకుని.. కడుపు నింపుకునే సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు పడిన దెబ్బ ఇది. కరోనా రాసిన కన్నీటి చరిత్ర ఇది. బెంగుళూరు, హైదరాబాద్ వదిలేస్తే… దేశ వ్యాప్తంగా రూ. లక్షన్నర కోట్లు సంపదని మధ్యతరగతి కోల్పోయింది. ఏ ప్యాకేజీలు వారిని ఆదుకోలేదు. ఏ ప్రసంగాలు వారికి ఆత్మ నిర్భరం ఇవ్వలేదు…!
ప్యాకేజి ద్వారా ఏమిచ్చినట్టు…??
దేశంలో కరోనా కల్లోలం అందరికి కనిపిస్తుంది. ప్రపంచంలో అత్యధిక కేసులున్న జాబితాలో మూడో స్థానంలో ఉన్నాం. దీనిపై ప్రభుత్వం దాదాపుగా చేతులెత్తేసినట్టే. కేవలం పైకెజి ప్రకటించి దాన్ని పరిష్కారంగా గొప్పగా చెప్పుకుంటుంది మోడీ ప్రభుత్వం. రూ. 20 లక్షల కోట్లు అంటూ చాల సార్లు ప్రకటించుకుని, స్వయంగా ఉప్పొంగింది బీజేపీ నాయకత్వం. కానీ ఆ ప్యాకేజీ ప్రకటించడానికి మూడు రోజులు పట్టింది. కానీ ఆ సంతోషం మూడు గంటలు కూడా లేదు. ఎందుకంటే కరోనా కారణంగా నష్టపోయిన అల్ప, మధ్యతరగతి వర్గాలకు మాత్రం ప్యాకేజి ద్వారా వచ్చిన లబ్ది ఏమి లేదు. కేవలం వలస కార్మికులకు ఆరు నెలల రేషన్ తప్పితే… మిగిలినవన్నీ రాయితీలు, రుణాలు మాత్రమే ఇచ్చారు. ఇది పరిష్కారం కాదు అంటూ ఆర్ధిక వేత్తలు చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు తక్షణమే ఆదుకోవాల్సింది మధ్యతరగతి వ్యాపారులను, పేద వర్గాలను మాత్రమే…!!
కన్నీటిని మింగి బతకాలేమో…!!
బెంగుళూరు అంత దూరం అవసరం లేదు. మన నెల్లూరో, ఒంగోల్లో, ఏలూరునో ఉదాహరణగా చెప్పుకుందాం…!! ఇవి మధ్య స్థాయి నగరాలు. రెండున్నర లక్షల జనాభా.., సుమారుగా 5 వేల దుకాణాలు.., 250 హోటళ్లు ఉంటాయి. వీటిలో కూడా అదే పరిస్థితి. దుకాణాల్లో గడిచిన అయిదు నెలలుగా వ్యాపారాలు నిలిచిపోయాయి. గతంలో నెలకు రూ. 15 లక్షలు టర్నోవర్ జరిగే దుకాణాల్లో ఇప్పుడు అక్కడా కూడా రూ. 5 లక్షలకు మించడం లేదు. ఇది లాభం రాకపోగా.., నిర్వహణాని పెంచింది. అందుకే ఈ స్థాయి దుకాణాలు మునిగాయి. ఏపీలోనే దాదాపు 35 వేల దుకాణాలు మూత దశకు చేరాయని వ్యపార వర్గాల ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఇవి కాకుండా హోటళ్లు, కార్యాలయాలు, చిన్న స్థాయి స్కూళ్ళు అదనం..! ఈ కుటుంబాలన్నీ కన్నీటిని మింగి బతకాలి. ప్యాకేజి లేదు, సాయం అందదు.., బతుకు బండి నడవడం లేదు.
ఏ వర్గాలపై అధిక ప్రభావం అంటే…!!
కరోనా కారణంగా నిత్యావసరాలకు పెద్దగా ఇబ్బంది లేదు.., మెడికల్ కూడా అదే స్పీడ్ లో ఉంది. ఇక దుస్తులు, చెప్పులు, ఫుడ్ వరకు ఏమి ఇబ్బంది ప్రస్తుతానికి లేదు. కానీ…!! ఎలక్ట్రానిక్, ఆటో మొబైల్, రవాణా, టాయ్స్, మీడియా, కాస్మొటిక్స్, బ్యూటీ, ఉక్కు, నిర్మాణ రంగాలకు పెద్ద దెబ్బ పడింది. వీటిలో కొన్ని పూర్తిగా కోలుకోవడమే కష్టంగా మారింది. ఏఏ రంగాలపై ఆధారపడిన దాదాపు 50 లక్షల కుటుంబాల పరిస్థితి ప్రస్తుతం ఏపీలో ప్రశ్నర్ధకంగా మారింది. వీరికి కావాలి ప్యాకేజి. వీరికి ఇవ్వాలి ఆత్మ నిర్భరం.., ఇటువంటి కుటుంబాలకు దక్కాలి భరోసా..!!
(కరోనా నేపథ్యంలో ఆర్ధిక నిపుణులు ఇస్తున్న సలహాలు ఏమిటి? మదుపు సూత్రాలు ఎలా పాటించాలి? ఇంకా ఎంత కాలం ఇలా కొనసాగవచ్చు అనేది తర్వాత కథనంలో చూద్దాం..!!)