రాష్ట్ర రాజకీయాల్లో గంటా శ్రీనివాసరావు పాత్ర “చలన”చిత్రంగా ఉంటుంది. ఆయన ఒక పార్టీలో ఉండలేక అయిదేళ్లకోసారి చలనం చేస్తుంటారు. వైసీపీలోకి కూడా ఇదిగో, అదిగో అంటూ మొహూర్తాలు ఖరాయయ్యాయి. కానీ చేరిక జరగలేదు. దీనికి కారణం ఏంటా అని లోతుగా ఆరాతీస్తే.. గంటా పాత్ర ఉన్న ఓ పెద్ద భూ స్కామ్ బయట పడింది. ప్రస్తుతం విశాఖలో ఇది పెద్ద సంచలన అంశంగా మారింది. ఈ స్కామ్ తెలిసిన సీఎం జగన్ ఇక గంటా ఎంట్రీకి నో చెప్పేశారని వైసీపీ వర్గాల్లో వినిపిస్తుంది. ఆ స్కామ్ ఏమిటంటే..!?
ప్రభుత్వ భూమిని పంచుకున్నారు..!
విశాఖపట్నం గ్రామీణ మండలంలో అడవివరం గ్రామంలో అన్నీ ప్రభుత్వ భూములే. సింహాచలం దేవస్థానానికి ఇక్కడ అనేక భూములున్నాయి. విజయరాంపురం అనే శివారు గ్రామంలో 124 ఎకరాల ఈనాం భూమి ఉంది. దీనిలో 30 ఎకరాలకు గాను విజయనగరం రాజుల వారసులు 2006 లో కొందరికి పట్టా ఇచ్చారు. మిగిలిన భూమి అలాగే ఉంది. దీనిపై ఎప్పటి నుండో నాయకుల కళ్ళు ఉన్నాయి. గంటాకి కాస్త పెద్ద కన్ను, కాలు, చేయి అనీ వేసి పట్టాలు పుట్టించారు. తాను గత రెండు ప్రభుత్వాల్లోనూ మంత్రిగా పని చేశారు. జిల్లాలో చీమ తిరగాలన్నా, ఈగ తుమ్మాలన్నా గంటాకు చెప్పే జరగాలి అనేంతగా పెత్తనం చేశారు. ఈ క్రమంలోనే తన అధికారం దర్పంతో భూ దాహం తీర్చుకున్నారు. కొందరు భూ మాయలోళ్లు ద్వారా 77 ఎకరాల భూమికి నకిలీ పట్టాలు సృష్టించి.., లేని సర్వే సంఖ్య 13 సృష్టించి.., తన భార్య, అనుయాయుల పేరిట రిజిస్ట్రేషన్లు కూడా చేయించేశారు. గంటా భార్య పేరిట 4 . 85 ఎకరాలు.., మరో 11 మంది ముఖ్య అనుచరుల పేరిట మిగిలిన భూమిని రాయించేశారు అనేది విశాఖలో జరుగుతున్న చర్చ. ఈ అంశాలు తెలుసుకున్న అధికారులు, నాయకులూ కూడా ఖిన్నులైపోయారట.
రూ. 300 కోట్ల విలువ..!!
ఈ భూముల బహిరంగ మార్కెట్ విలువ రూ. 300 కోట్ల వరకు ఉంటుందని అంచనా. విశాఖ చుట్టుపక్కల మధురవాడ, ఎండాడ, రుషికొండ, అడవివరం సమీపంలోనే ఈ భూమి ఉంది. ఎకరం రూ. నాలుగున్నర నుండి రూ. 5 కోట్లు వరకు విలువ పలుకుతుంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ భూమిని తాకట్టు పెట్టి కొన్ని సహకార బంకుల్లో రుణాలు కూడా తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారం ఈ ప్రభుత్వం వచ్చాక బయటపడింది. రెవెన్యూ అధికారులు పూర్తిగా విచారణ చేసి, జిల్లా కలెక్టర్ కి నివేదిక ఇచ్చారు. అంతా గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం నడిచినట్టు తెలుస్తుంది. ఈ భూములను కూడా ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు రద్దు చేసి.., వెనక్కు తీసుకుంది. దీనిపై సిట్ వేసి, విచారణకు కూడా ఆదేశించాలి అనుకునే సమయంలో గంటా వైసీపీలో చేరికకు సిద్ధమయ్యారని సమాచారం.
ఈ వ్యవహారాలపై జగన్ పూర్తి దృష్టి..!!
గంటా విషయంలో వైసీపీ జిల్లా నేతలు మొదటి నుండి ఒక అవగాహనతో ఉన్నారు. గంటా రాజకీయం, అవినీతి వ్యవహారాలు బాగా తెలుసు కాబట్టి.. అతన్ని వైసీపీలోకి రాకుంటే బాగుంటుందని భావించారు. జిల్లా మంత్రి అవంతి శ్రీనివాసరావు, కీలక నేత విజయసాయిరెడ్డి కూడా ఇదే విషయంలో స్పష్టతతో ఉన్నారు. జగన్ దగ్గర కూడా ఈ అంశాలు లేవనెత్తారు. ఈ మొత్తం భూ కుంభకోణంతో పాటూ.., గతంలో ఆయన మంత్రిగా పని చేసిన శాఖల్లో అవినీతిపై నివేదికలు తెప్పించుకున్న సీఎం జగన్ ఇక గంటాని రానీయకపోవడమే మంచిదని భావించారట. సో.., గంటా చేరిక ఆగింది. కాకపోతే అతని అవినీతిపై విచారణ ఆగుతుందో లేదో మాత్రం ప్రస్తుతానికి సందేహమే. అదే జరిగితే జిల్లాలో భూ స్కామ్ తో పాటూ.., ఆయన శాఖలో తీసుకున్న నిర్ణయాలు, భర్తీ చేసిన ఉద్యోగాలు, కళాశాలల అనుమతులు అన్నింటిపైనా విచారణ వేయనున్నారు.