రాజకీయాల్లో కొంతమంది నాయకులు ఉంటారు. పేరుకి పార్టీలో ఉండి పార్టీ తరఫున నిర్వహించే కార్యక్రమాలకు హాజరుకారు. కానీ మేము మాత్రం పార్టీ మనుషులమే దానికి ప్రత్యేకంగా ఎలాంటి రుజువులు అవసరం లేదని అంటుంటారు. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో అంతెందుకు నియోజకవర్గంలో ప్రజలకు తీరని కష్టం వచ్చినా…. పక్క జిల్లాల నుండి వారి పార్టీ నేతలు పరామర్శించేందుకు పోయినా…. ఇల్లు పక్కనే పెట్టుకుని సేదతీరుతారే తప్ప వచ్చి ఆ సమస్యకు అడ్డుగా నిలబడరు. అసలు అలాంటి వాళ్లు పార్టీలో ఉన్నారని అనుకోవాలా లేక ఇండిపెండెంట్ నాయకుడి లెక్కల్లోకి వేయాలో తెలియక విశ్లేషకులు కూడా తలలు పట్టుకుంటారు.
అయితే ఈ విషయం తమకే అర్థం కావడం లేదని అంటున్నారు మాజీ మంత్రి మరియు విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అనుచరులు. గత ఏడాది జగన్ సునామీని తట్టుకొని విజయం సాధించిన ఆయన ఇప్పుడు అసలు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉన్న కనీస గుర్తింపు కోల్పోయారు. అసలు ఏ పార్టీలో అయినా నిలకడగా రాజకీయాలు చేసిన చరిత్ర లేని గంటా శ్రీనివాసరావు కు లేదు. గతంలో అనేక పార్టీలు మారారు. 2014 లో టిడిపి తరఫున పోటీ చేసి విజయం సాధించిన ఆయనకు మంత్రి పదవిని బాబు కట్టబెట్టారు. ఇక 2019లో పార్టీ మొత్తం ఘోర పరాజయం పాలైనా పదవి దక్కించుకున్న అతికొద్ది మంది ఎమ్మెల్యేలలో ఆయన ఒకడు. సాధారణంగానే అలాంటి వారికి పార్టీలో ప్రాముఖ్యత పెరుగుతుంది కానీ గంటా మాత్రం అసలు నాకు పార్టీకి ఏ మాత్రం సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నాడు.
ఇక అతని గురించి తెలిసిన కొంత మంది నాయకులు అయితే ఎప్పటి నుండో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం గంటా నైజమని.. దాని గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. జగన్ కండిషన్లు పెట్టారు కాబట్టి సరిపోయింది లేకుంటే మనోడు ఎప్పుడో సైకిల్ దిగేసేవాడు అని సెటైర్లు వేస్తున్నారు. సరే వాళ్ళందరూ తప్పు అని నిరూపించేలా ఆయన ఏనాడైనా వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడా అంటే అదీ లేదు. చంద్రబాబు పిలుపుని అనుసరించి ఏదైనా కార్యక్రమంలో పాల్గొన్నారా అంటే ఆయన ఎక్కడ కనపడినా దృశ్యం లేదు.
అంతెందుకు తాజాగా విశాఖపట్నంలోని ఎల్ జి పాలిమర్స్ లో గ్యాస్ లీక్ జరిగి 12 మంది మృతి చెందారు. వందలాది మంది హాస్పిటల్ లో చేరగా వేల మంది ప్రజలు రోడ్డున పడ్డారు. అయితే ఈ ఘటన జరిగింది టిడిపి నేత గణబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం లోనే. వెంటనే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అక్కడికి రావాలంటే ప్రయత్నించినా ఆయన వేరే రాష్ట్రంలో ఉండటంతో అది వీలుపడలేదు. అయితే స్థానికంగా ఉన్న నేతలు వెళ్లి ప్రజలను పరామర్శించాలని బాబు చెప్పారు.
దీంతో శ్రీకాకుళం నుంచి అచ్చన్నాయుడు, తూర్పుగోదావరి నుంచి చినరాజప్ప, పశ్చిమ గోదావరి నుంచి రామానాయుడు వంటి వారు హుటాహుటిన వెళ్లి బాధితులను పరామర్శించారు. కానీ గంటా శ్రీనివాసరావు మాత్రం దూరంగా ఉన్నారు. దీంతో మరోసారిఆయన అసలు పార్టీలో ఉండాలని అనుకుంటున్నారా? లేదా? అనే చర్చ జోరుగా సాగుతుండడం గమనార్హం