(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
వైఎస్ జగన్కు వీర విధేయుడు, చంద్రబాబుకు బద్ద శత్రువు, వైసీపీలో ఒక వర్గానికి బ్రాడ్ అంబాజిడర్ ఈ మూడు లక్షణాలు మూటగట్టుకున్న కొడాలి నాని ఒక అవలక్షణాన్ని మాత్రం పెద్ద మూట నెత్తిన పెట్టుకొని తిరుగుతున్నారు. ఆ అవలక్షమే ఆయనకు మంత్ర పదవి నుండి దూరం చేసే ప్రమాదం తెచ్చిపెట్టింది. కొడాలి నానిని మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేయాలంటూ ఏపి బీజెపి తీర్మానం చేయడం, ఆ తీర్మాన ప్రతిని బీజెపీ కేంద్ర పెద్దలకు పంపించడం రాష్ట్రంలో ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఏపిలో బీజేపీకి వైసీపీకి మధ్య ఓ అంతర్గత బంధంతో రాజకీయాలు నడుస్తున్నాయి. అందుకే వైసీపీ ఎక్కడ తప్పులు చేస్తున్నా బీజెపీకి కళ్లేదురుగా కనిపిస్తున్నా పెద్దగా మాట్లాడింది లేదు. వైసీపీ చేస్తున్న తప్పులను కూడా టీడీపీనే కారణంగా చూపించి ఇన్నాళ్లు బీజేపి నాయకులు అందరూ టీడీపీని టార్గెట్ చేస్తూ వచ్చారు. అయితే హిందూ మతంపైన, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపైనా, విగ్రహాల ధ్వంసంపైనా, టీటీడీ డిక్లరేషన్ అంశంపైనా కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు బీజేపీని తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. అందుకే ఆయన్ను వెంటనే తొలగించాలంటూ తీర్మానం ప్రవేశపెట్టేశాయి. ఇది ఎంత వరకూ వెళుతుంది అన్నదే పెద్ద ప్రశ్న.
ఢిల్లీ పెద్దలు అన్నీ చూసే ఉంటారుగా..!
కొడాలి నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రెండు రోజులు గడిచింది. బిజెపి పదాధికారుల సమావేశం ముగిసి ఒక రోజు గడిచింది. ఈ వ్యవధిలోని సీఎం వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్లి వచ్చారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీలో ఏమి జరిగిందో బయటకు రాలేదు. కానీ ఒక అంశం మాత్రం స్పష్టం. జగన్ రాష్ట్రానికి నిధుల కోసమో, రాష్ట్రం ప్రగతి కోసమో, విభజన చట్టం హామీల కోసమో ఢిల్లీకి వెళితే అమిత్ షాతో కలవాల్సిన పని లేదు. ప్రధాన మంత్రి మోడీ, లేదా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కావాల్సి ఉంది. రాజకీయ అంశాలు చర్చకు వస్తేనే హిందూ మతానికి చెందిన ఇటువంటి వివాదాస్పదాలు చర్చకు వస్తేనే అమిత్ షాను కలవాల్సి ఉంటుంది. అందుకే ఇప్పుడు అమిత్ షాను కలిశారు కాబట్టే జగన్ ను అమిత్ షా హెచ్చరించారు అనే వార్తలు వస్తున్నాయి. ఒక వేళ అదే నిజమైతే మాత్రం జగన్ ఢిల్లీ నుండి వచ్చిన వెంటనే తిరుమల శ్రీవారి దర్శనం నుండి వచ్చిన వెంటనే కొడాలి నానిపై చర్యలకు ఉపక్రమించే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే కొడాలి నాని వ్యాఖ్యల కారణంగా వైసీపీలో కొంత మంది సీనియర్ నాయకులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందుకే కొడాలి నాని పదవిపై ప్రస్తుతం ఒ కత్తి వేలాడుతోంది.
పార్టీ విమర్శలైతే వదిలివేసే అవకాశం ఉంది
మరో కీలక విషయాన్ని చెప్పుకోవాల్సి ఉంది. వైసీపీలో మంత్రులు గానీ, నియోజకవర్గ స్థాయి నాయకులు గానీ, సామాజిక వర్గాల నాయకులు గానీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలంటే కశ్చితంగా వైసీపీ పెద్దల అనుమతి ఉండాల్సిందే. ఎవరికి వారు స్వంతంగా వెళ్లి మాట్లాడేస్తాం అంటే కుదరదు. అందుకే కొడాలి నాని వ్యాఖ్యల వెనుక ఏదో వ్యూహం ఉండే ఉంటుందని వైసీపీలో మరో వర్గం భావిస్తోంది. ఒక వేళ అదే నిజమైతే ఆయన మంత్రి పదవికి ముప్పు ఏమీ ఉండకపోవచ్చు కానీ మందలింపు మాత్రం ఉంటుంది. ఇక్కడ అన్నింటికంటే పెద్దగా చర్చించుకోవాల్సిన అంశం కేంద్రం స్థాయిలో అతి పెద్ద పార్టీగా ఉన్న బీజేపి ఇక్కడ వైసీపీతో పైకి కనిపించని బలమైన బంధాన్ని నిర్వహిస్తూనే ఒక మంత్రిని తొలగించాలని తీర్మానం చేయడం, ఆ తీర్మానాన్ని నెగ్గించుకోవడానికి ఒత్తిడి తేస్తుందా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్న. నిజానికి ఆ తీర్మానం నెగ్గించుకోవాలని బిజెపికి అనిపిస్తే చిటికెలో పని. జగన్ ను పిలిపించి ఒత్తిడి తీసుకువచ్చి జరిగిన ముప్పును వివరించి నానిని తప్పిస్తే నీకే మంచిది అని హెచ్చరించి మంత్రి పదవి నుండి తప్పించి ఆ ప్రయోజనాన్ని, హిందూ సెంటిమెంట్ను బీజెపి తామే సాధించినట్లు క్లైమ్ చేసుకునే వీలు ఉంది. అయితే ఈ రాజకీయ అంశాలు అన్నీ బీజేపీకి లాభం లేకుండా టీడీపీకి మంచి చేస్తాయని భావిస్తే మాత్రం నానికి మంత్రి పదవికి ముప్పు ఉండదు. బీజేపి తీర్మానం నెరవేరదు. అందుకే ఈ ముక్కోణ రాజకీయ అంశంలో ఏమి జరుగుతుంది అనేది వేచి చూడాల్సి ఉంది.