లగడపాటి రాజగోపాల్ కి రాజకీయాల్లో కన్నా ఎన్నికల ఫలితాలు చెప్పడంలో మంచి గ్రిప్ ఉండేది. ఆయనకు సొంతంగా ఫ్లాష్ టీం ఒకటి పనిచేసేది. మీరు ఎన్నికల వేళలో ఆయన నియోజకవర్గాలు తిరిగి శాంపిల్స్ సేకరించి పక్కాగా ఫలితాలు చెప్పేవారు. సుమారు రెండు ఎన్నికల్లో లగడపాటి చెప్పిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎన్నికల్లోనూ ప్రతిబింబించాయి. దీంతో ఆయన ఎగ్జిట్ పోల్స్ చెప్పడంలో ఓ బ్రాండ్ గా తయారయ్యారు… అయితే 2019 ఎన్నికల్లో మాత్రం లగడపాటి జోస్యం తలకిందులైంది. టిడిపికి పూర్తి అనుకూలంగా లగడపాటి చెబితే అది పూర్తిగా వైసీపీ వైపు తిరిగింది. 2019 ఎన్నికల ముందు కూడా లగడపాటి చెప్పిన కొన్ని సర్వేలు ఫెయిల్ అయ్యాయి…. లగడపాటి సర్వే కాదు జాతీయ మీడియా సంస్థలు, పలు ప్రతిష్టాత్మక వెబ్సైట్స్ నిర్వహిస్తున్న ఎగ్జిట్ పోల్ సర్వే లన్నీ తప్పే అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో జరిగిన రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఎన్నికల నుంచి మొన్నటి బీహార్ ఎన్నికల వరకు, ఇటు జిహెచ్ఎంసి మున్సిపల్ ఎన్నికల్లోనూ సర్వేలు ఏవి ఎగ్జిట్పోల్స్ ఏవి ఓటర్ నాడిని పట్ట లేకపోయాయి. గతంలో ఎన్నికల ముందే ఎగ్జిట్ పోల్స్ ఉండేవి. అవి ఓటర్ల తీర్పును తీవ్ర ప్రభావితం చేస్తున్నాయని కోణంలో ఎన్నికల సంఘం ఎన్నికలు ముగిసిన తర్వాత మాత్రమే ఎగ్జిట్ పోల్స్ విడుదలచేయాలని ఆంక్షలు విధించింది. గతంలో వచ్చే ఎగ్జిట్ పోల్స్ అన్ని ఓటరు ఏం చెప్పదలచుకున్నా డు అనేది ఖచ్చితంగా ప్రతిబింబించేవి. ప్రస్తుతం అంతా తలకిందులైంది.. తారుమారైంది… (ఎందుకిలా అంటే ) ఓ సర్వే సంస్థ చెప్పిన విషయాల ప్రకారం…….
**ప్రజలు తమ అభిప్రాయాలని ఓపెన్ గా చెప్పడానికి ఇష్టపడడం లేదు. అధికార పార్టీకి ఓటు వేయం అని చెబితే ఏం నష్టం వస్తుందో, ఎందుకొచ్చిన తలనొప్పి అని..దాదాపు సగం మంది నిజం చెప్పడం లేదు. సర్వేలు ఫెయిల్ అవడానికి ఇది ప్రధాన కారణం.
** సర్వేలు చేసే నైపుణ్యం ఉన్న ఉద్యోగులు లేకపోవడం రెండవ కారణం..శాస్త్రీయంగా సర్వే చేయాలి అంటే ఒక్కో ఉద్యోగి రోజుకి 30 మందిని సర్వే చేయగలరు. రోజుకి రూ.1200 లేనిదే ఎవరూ పనిచేయరు. అంటే ఒక్కో సాంపిల్ కి రూ.40 ఫీల్డ్ ఖర్చు అవుతుంది. దీనికి ఓవర్ హెడ్స్ కూడా కలుపుకుంటే ఒక్కో సాంపిల్ కి రూ.60 లు అవుతుంది. కానీ రాజకీయ పార్టీలు ఒక్కో సాంపిల్ కి రూ.40 కి మించి ఇవ్వడం లేదు. దీనితో సర్వే క్వాలిటీ దెబ్బతింటోంది.
** సర్వే చేసే వారి స్వంత రాజకీయ అభిప్రాయాలు సర్వే ఫలితాలపై ప్రభావం చూపుతున్నాయి. ఫీల్డ్ లో ఓటర్లు చెప్పిన అభిప్రాయం కాకుండా సొంత అభిప్రాయం రికార్డ్ చేయడం కూడా ఎక్కువ అవుతోంది.
** వీటన్నిటికి మించి, అన్ని రంగాలకి ఉన్నట్లే, చిత్తశుద్ధి, నైపుణ్యం, అంకితభావం, కష్టపడేతత్వం ఉన్న ఉద్యోగుల కొరత, ఈ రంగంలో కూడా ఉంది.
వీటిని అధిగమించి, ప్రజానాడిని పర్ఫెక్ట్ గా అంచనా వేసే పద్ధతుల కోసం పరిశోధనలు జరుగుతున్నాయి. …
….. నిజమే… నిపుణులైన సర్వేయర్లు దొరకడం లేదు, దొరికినా ఖర్చు ఎక్కువ… అంత గిట్టుబాటు కావడం లేదు… ఫలితంగా శాస్త్రీయమైన ఒపీనియన్ పోల్ గానీ, ఎగ్జిట్ పోల్ గానీ సాధ్యం కావడం లేదు… అయితే… ఇవన్నీ వేస్ట్, ఏదో సంస్థ పేరు పెట్టేసి, చకచకా ఫోటోషాపులో నాలుగు అంకెలు రాసేసి… సోషల్ మీడియాలో పుష్ చేసే ఉదాహరణలే బోలెడు ఇప్పుడు… సర్వే శాంపిళ్ల సంఖ్య అడిగేవాడెవ్వడు..? సర్వేకు అనుసరించిన పద్ధతిని అడిగేవాడెవ్వడు..?
** తమకు డబ్బులిచ్చిన వాడి ప్రయోజనాల కోసం… అప్పటికప్పుడు ఏదో వండి, వాట్సప్ గ్రూపుల్లో వార్చడం, వడ్డించడం… అంతే… ఎంట్రీ పోల్ లేదు, ఎగ్జిట్ పోల్ లేదు… మొన్న దుబ్బాకలో, నిన్న గ్రేటర్లో ఇలాంటి ఫేక్ సర్వేలు బోలెడు కనిపించాయి… ఏదో ఓ సంస్థ పేరిట రిలీజ్ చేస్తే సరి…
** నిజానికి సర్వేల్లో మంచి అనుభవం, పేరు, ప్రొఫెషనలిజం ఉన్న సంస్థలు కూడా దుబ్బాక, గ్రేటర్ ఫలితాలను సరిగ్గా అంచనా వేయలేకపోయాయి… కొందరు నిజమేమిటో తెలిసినా బయటికి చెప్పలేదు.. కొంత భయం, కొంత సందేహం… వాస్తవంగా సర్వే చేయటానికి శాంపిళ్ల సంఖ్య ఎంత ముఖ్యమో… వాటి నాణ్యత కూడా అంతే ముఖ్యం… అంటే వయస్సు, వృత్తి, ప్రాంతం, నేపథ్యం, చదువు గట్రా సరైన నిష్పత్తిలో చూసుకుని, వారి నుంచి అభిప్రాయం సేకరించాలి… నువ్వు వోటు ఎవరికి వేస్తావు, వేశావు అనే సింగిల్ ప్రశ్న కాదు… వాళ్ల మూడ్ను బయటపెట్టే కొన్ని ప్రశ్నలు అవసరం… ఆ జవాబుల నుంచి వాళ్ల వాస్తవ మూడ్ పట్టుకోవాలి… అంటే డేటా క్రోడీకరణ, విశ్లేషణ కూడా ముఖ్యమే…
**ఇంత కీన్గా సర్వేలు చేస్తున్నవారెందరు..? పోటీ తీవ్రంగా ఉండి, ఇద్దరి నడుమ తేడా వన్, టూ పర్సెంట్ మాత్రమే ఉన్నప్పుడు సర్వేలు అస్సలు సరైన ఫలితాన్ని చూపించలేవు కూడా… దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ నడుమ తేడా చాలా స్వల్పం… ఈ స్థితి కూడా సర్వే సంస్థలకు ఇరకాటమే… సంకటమే… అదే జరిగింది…!
**కావాలని ఒపీనియన్ పోల్ పేరిట ఏదో జనంలోకి వదిలేసి, తమకు అనుకూలంగా జనం మూడ్ కొంతయినా మార్చుకుందామని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తాయి… అలా సర్వేలను వండిస్తాయి… జనంలోకి వదులుతాయి… అలాంటి ఉద్దేశపూర్వక సర్వేలతో మొత్తం సర్వేలనే జనం నమ్మని దుస్థితి ఏర్పడింది… ఇక ఎగ్జిట్ పోల్స్ కూడా అంతే… వాటితో పార్టీలకు వచ్చే ప్రయోజనం ఏమీ లేకపోయినా… అదొక అలవాటుగా మారుతోంది… ఫలితంగా సర్వేలు తమ విశ్వసనీయతను కోల్పోయాయ్… ఎంత ఖర్చు చేసి, ఎంత కచ్చితత్వాన్ని చూపించినా సరే జనం నమ్మడం లేదు… అదీ సర్వేల పరిస్థితి.