సుప్రీం కోర్టులో రమేష్ కుమార్ అఫిడవిట్..దారులన్నీ క్లోజ్…కోర్టు చర్యలకు దిగితే మరింత నష్టం.
అనేక తర్జన భర్జనలు..సుదీర్ఘ న్యాయ పోరాటం తరువాత రాష్ట్ర ప్రభుత్వం కోర్టు తీర్పుకు లోబడి నిర్ణయం తీసుకోక తప్పలేదు. సుప్రీం తుది తీర్పు వచ్చే వరకూ వేచి చూడాలని భావించినా..గత వారం సుప్రీం చేసిన వ్యాఖ్యలు..హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు..గవర్నర్ సైతం రమేష్ కుమార్ ను తిరిగి నియమించాలంటూ ఆదేశించటంతో ప్రభుత్వం పైన ఒత్తిడి పెరిగింది. గత వారం ఈ కేసు విచారించిన సుప్రీం కోర్టు వారం లోగా చేసిన వాదనలకు మద్దతుగా అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. దీంతో..ఆయన గురువారం సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేసారు. అప్పటి వరకు వేచి చూసిన ప్రభుత్వం..సుప్రీం తుది తీర్పు వచ్చే వరకు వేచి చూస్తూ..ఈ లోగా కోర్టు ధిక్కరణ పిటీషన్ పైన స్టేకు సుప్రీం నిరాకరించిన సమయంలో..అధికారులను బాధ్యులను చేసే అవకాశం ఉందనే చర్చ సాగింది. దీని పైన పెద్ద ఎత్తున మేధో మధనం తరువాత రమేష్ కుమార్ ను తిరిగి ఎన్నికల కమిషనర్ గా నియమిస్తూ అర్ధ్రరాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, అందులో సుప్రీం తీర్పుకు లోబడి అనే విషయాన్ని స్పష్టం చేసింది.
స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాతో మొదలై…హైకోర్టు ఉత్తర్వుల మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ను పునర్నియమిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేరుతో ఈ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ మేరకు గెజిట్ విడుదల చేయాలని పంచాయతీరాజ్,గ్రామీణ అభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు ఇచ్చారు. అయితే స్పెషల్ లీవ్ పిటిషన్పై సుప్రీం ఇచ్చే తీర్పుకు లోబడే పదవీ పునర్నియామకం ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను తమతో చర్చింకుండా వాయిదా వేయటంతో.. ఆయన పైన ఆగ్రహంతో ఉన్న ప్రభుత్వం ఎన్నికల సంస్కరణ పేరుతో ఏపీ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ పదవీ కాలం కుదింపు, కొత్త కమిషనర్గా జస్టిస్ కనగరాజును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నిమ్మగడ్డ కోర్టును ఆశ్రయించటంతో న్యాయస్థానం ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. తిరిగి రమేష్ కుమార్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమించాలని ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని పలుమార్లు కోరినప్పటికీ సుప్రీం కోర్టు తిరస్కరించింది. దీంతో..హైకోర్టు తీర్పును అమలుచేయట్లేదంటూ నిమ్మగడ్డ కోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని హైకోర్టు విచారణకు స్వీకరించింది. అయితే దీనిపై స్టే ఇవ్వాలంటూ జగన్ సర్కార్ సుప్రీంను ఆశ్రయించగా మరోసారి చుక్కెదురైంది. స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది.
చివరి నిమిషంలో తప్పని స్థితిలో..సుప్రీంకోర్టులో చెప్పిన విధంగా గురువారం రమేష్ కుమార్ సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేసారు. గత శుక్రవారం సుప్రీం చేసిన వ్యాఖ్యల తరువాత ఏ రకంగా ముందుకెళ్లాలనే అంశం పైన ముఖ్యమంత్రి స్థాయి లో పెద్ద ఎత్తున చర్చలు సాగాయి. అయితే, ఈ రోజు వరకూ సుప్రీం సమయం నిర్ధేశిస్తూ ఆ లోగా రమేష్ కుమార్ ను ఎన్నికల కమిషనర్ గా తిరిగి నియమించాలని ఆదేశించింది. దీంతో..30వ తేదీ ముగిసే సమయానికి చివరి నిమిషంలో ఈ జీవోను ప్రభుత్వం జారీ చేసింది. ఇప్పటికీ ఒక మెట్టు దిగితేనే కోర్టులో ప్రభుత్వం తరపున తదుపరి వాదనలు ఇటు హైకోర్టులో అయినా..అక్కడ సుప్రీంలో అయినా బలంగా వినిపించేందుకు అవకాశం ఉంటుందని..ముందుగా కోర్టు ఆదేశాలు అమలు చేయటం అన్ని రకాలుగా మేలని న్యాయ నిపుణులు ప్రభుత్వానికి సూచించినట్లుగా సమాచారం. దీంతో..సుప్రీం విచారణ ఆగస్టు 4వ తేదీన ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనను తిరిగి ఎన్నికల కమిషనర్ గా నియమించి..హైకోర్టు తీర్పులోని అభ్యంతరాలు…తదుపరి వాదనలు సుప్రీంలో కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో..సుప్రీం తుది తీర్పుకు లోబడి రమేష్ కుమార్ కొనసాగింపు ఆధార పడి ఉంటుంది. ప్రస్తుతానికైతే ప్రభుత్వం ఒక మెట్టు దిగక తప్పని పరిస్థితి ఏర్పడింది.