“సిత్తరాల సిరపడు సిత్తరాల సిరపడు
పట్టు పట్టినాడ.. ఒగ్గనే ఒగ్గడు
పెత్తనాలు నడిపేడు.. సిత్తరాల సిరపడు” ఇదీ ఈ ఏడాదిలో వచ్చిన అల.. వైకుంఠపురంలో పాత. బీభత్సమైన హిట్టు. ఈ పాట గురించి ఇప్పుడు ఎందుకంటే… సిక్కోలు జిల్లా రాజకీయాలు గురించి చెప్పుకోవాలంటే ఇక్కడి నుండి మొదలు పెట్టాల్సిందే. పేరుకే వెనుకబడిన జిల్లా కానీ…, రాజకీయ పోరులో రాష్ట్రంలో ఏ మాత్రం తీసిపోరు..! తాజాగా ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కీ.., మంత్రి సిదిరి అప్పలరాజుకి మధ్య రగిలిన రాజకీయం.., జిల్లాలో సంచలనంగా మారింది..!!
ఒకరిపై ఒకరు ఘాటు వ్యాఖ్యలు..!!
నిన్న, ఈరోజు ఈ జిల్లాలో కొన్ని ఘాటు వ్యాఖ్యలు చూస్తే రాజకీయం ఎంత వేడెక్కిందో అర్ధం చేసుకోవచ్చు. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుకి తరచూ ప్రెస్ మెట్ పెట్టి మాట్లాడడం అలవాటు. మంత్రి నియోజకవర్గంపల్సాపై గట్టిగా మాట్లాడితే రాష్ట్రానికి వినబడుతుంది అనేది ఆయన ఆలోచన కావచ్చు.. అందులో భాగంగా నిన్న శ్రీకాకుళంలో ప్రెస్ మీట్ పెట్టి “మంత్రి అప్పలరాజు నియోజకవర్గం పలాసలో సూదికొండపై క్వారీ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ ఎన్వోసీ ఒక్కరోజులో పొందారు, పేరుకి క్వారీ తవ్వుతూ పక్కనే ఉన్న విలువైన భూమిని చదును చేస్తూ అమ్ముకోడానికి ప్రయత్నిస్తున్నారని” ఆరోపించారు. దీనికి కౌంటర్ గా మంత్రి అప్పలరాజు గట్టిగా ఇస్తూ.. సంచలనానికి తెరతీశారు. “గతంలో ఏం జరిగిందో ఎంపీకి తెలియదా..? ఎవరు దొంగలో, ఎవరి హయాంలో ఆక్రమణలు జరిగియో సాక్ష్యాధారాలతో చూపిస్తా. మీరు ఎప్పుడు వస్తారో చెప్పండి. ఇద్దరం కలసి సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఆక్రమణలు తొలగిద్దాం. దీనిపై, తన వ్యాఖ్యలపై ఎవరైనా కౌంటర్ ఇస్తే మీరు చేసిన ఆక్రమణలను రాత్రికి రాత్రే కూల్చేస్తాను” అంటూ ఘాటుగా మాట్లాడారు.
గతంలోనూ ఒకరిపై ఒకరు..!!
రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే శ్రీకాకుళం రాజకీయాలు నిత్యం చురుకుగా ఉంటాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని జిల్లాలో టీడీపీ నీరసించినా.. ఇక్కడ మాత్రం చురుకుగానే ఉంటుంది. మరోవైపు వైసీపీ కూడా ఈ జిల్లాలో పూర్తి పట్టుతో ఉంది. జిల్లాలో ఉన్నవి 9 నియోజకవర్గాలే అయినప్పటికీ అధికార పార్టీలో ఇద్దరు మంత్రులు, ఒక స్పీకర్ ఉన్నారు. ప్రతిపక్షంలో వరుసగా రెండో విడత కూడా రాష్ట్ర అధ్యక్షుడు ఈ జిల్లా నుండే ఉన్నారు. సో.., దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు ఈ జిల్లాలో రాజకీయం ఎంత ఘాటుగా, చురుకుగా ఉంటుందో..! ధర్మాన ప్రసాదరావు ఈ మధ్య డల్ అయినప్పటికీ.. తమ్మినేని సీతారాం, సిదిరి అప్పలరాజులు జిల్లాలో వైసీపీకి కీలకంగా మారిపోయారు..!
* అక్కడ నిత్యం మాజీ విప్ కూన రవికుమార్ X స్పీకర్ తమ్మినేని సీతారాం.., ఎంపీ రామ్మోహన్ నాయుడు X మంత్రి అప్పలరాజు.., అచ్చెన్నాయుడు X మంత్రి కృష్ణదాస్ కి మధ్య ఘాటుగా మాటలు ఉంటాయి.
టీడీపీ చేతి నుండి వైసీపీకి..!!
జిల్లాలో ఏడు వైసిపి, రెండు టీడీపీ గెలుచుకుంది. ఎంపీ స్థానం మాత్రం టీడీపీ నెగ్గింది. టీడీపీ నిత్యం ఆ జిల్లాలో యాక్టీవ్ గానే ఉంటుంది. ఆ పార్టీకి రాష్ట్రస్థాయి నేతలు ఆ జిల్లా నుండి వచ్చారు. ఎర్రన్నాయుడు సహా.., ప్రస్తుత స్పీకర్ తమ్మినేని సీతారాం రెండున్నర దశాబ్దాల పాటూ టీడీపీలో ఉంటూ ఆ జిల్లాలో చక్రం తిప్పారు. ఆ తర్వాత కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు పార్టీలో కీలకంగా ఎదిగారు. అందుకే అక్కడ వైసీపీకి ధీటుగా టీడీపీ ఉంటుంది. మిగిలిన 12 జిల్లాలో టీడీపీ ఓటమి బాధను ఇంకా మర్చిపోలేదు కానీ.. సిక్కోలులో మాత్రం అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, కూన రవికుమార్ లాంటి నేతలు నిత్యం యాక్టీవ్ గానే ఉంటారు. గతంలో జిల్లాలో పట్టు బాగా ఉన్న టీడీపీ ప్రస్తుతం కాస్త వెనకబడినప్పటికీ మాటల్లో మాత్రం తగ్గలేదు.