TDP – Janasena: ఏపీలో రాజకీయ కాక ఇప్పటి నుండే మొదలవుతుంది.. 2024 ఎన్నికల కోసం పార్టీల ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అందరికంటే ముందుగా రాబోయే ఎన్నికలకు సిద్ధమవ్వాలంటూ పార్టీ ముఖ్యులకు, ప్రజల్లో తిరగాలంటూ మంత్రులకు చెప్పేసారు..! 2019 ఎన్నికల్లో పని చేసిన ప్రశాంత్ కిషోర్ (పీకే) టీమ్.., మళ్లీ పార్టీ తరపున రంగంలోకి దిగుతోందంటూ తేల్చేశారు.. వైసీపీ అలా సమాయత్తమవుతుంటే మరి టీడీపీ ఎందుకు సైలెంట్ గా ఉంటుంది.. నిజానికి టీడీపీ నిద్రావస్థలో ఉన్నప్పటికి.. గత ఆరునెలల నుండి చీకటి ప్రణాళికలు వేసుకుంటుంది.. దీనిలో పొత్తుల అంశం కూడా ఒకటి.. జనసేన – టీడీపీ మధ్య పొత్తు అంశం కొత్తది కాకపోవచ్చు.. బాగా గమనిస్తే గడిచిన కొంత కాలంగా టీడీపీ – జనసేన ఏ నాడూ పెద్దగా విమర్శించుకోలేదు. మాటలు పొదుపుగా వాడుతున్నారు. కానీ అందులో లెక్కలు, లాజిక్కులే కొత్త అంశాలు..! అంతర్గతంగా ఈ రెండు పార్టీల మధ్య ఏమి జరుగుతుంది? ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తారు? ఏ పార్టీ లాభపడుతుంది? ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా? పొత్తు పెట్టుకునేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారు? అనే అంశాలపై కీలక సోర్సుల ద్వారా అందిస్తున్న విశ్లేషణ ఇది..!
TDP – Janasena: జగన్ కి బద్ధ వ్యతిరేకిగా జనంలోకి..!
పొత్తులు పెట్టుకుంటే సమర్ధించుకోవడం, సమాధానం ఇచ్చుకోవడం మొదటి అంశం. అందుకే పవన్ కళ్యాణ్ దానికి తగినట్టు సిద్ధమవుతున్నారు. పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీ పెట్టినప్పటి నుండి ఒకే పార్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అది జగన్మోహనరెడ్డి , వైఎస్ఆర్ పార్టీ అనే విషయం అందరికీ తెలుసు. కానీ పొత్తు విషయంలో బీజేపీతో ఒకసారి, వామపక్షాలు, బీఎస్పీతో ఒకసారి, టీడీపీతో ఒక సారి ఇలా రకరకాలుగా అడుగులు వేస్తూ వస్తున్నారు.. అయితే పవన్ కల్యాణ్ కు ప్రధాన శత్రువు జగన్మోహనరెడ్డి మాత్రమే. ఈ ఒక్క ప్రధాన కారణంతో 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీని ఓడించాలంటే టీడీపీతో జత కట్టాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నట్లు సమాచారం. అదే జనంలోకి, క్యాడర్ లోకి తీసుకెళ్లనున్నట్టు సమాచారం. ఎందుకంటే ఈ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే రాష్ట్రంలో వైసీపీని ఓడించడం అసాధ్యమని ఆ రెండు పార్టీలు ఫిక్సయ్యాయట..!
కొన్ని లెక్కలున్నాయి సుమీ..!
2019 ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో ఫలితాలను విశ్లేషించుకుంటే.. పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాల్లో పోటీ చేసి ఓడి పోయారు. గాజువాకలో పవన్ కల్యాణ్ 15 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అక్కడ తెలుగుదేశం పార్టీకి 56,440 ఓట్లు వచ్చాయి. అదే ఈ రెండు పార్టీల పొత్తుతో ఉంటే పవన్ కల్యాణ్ విజయం సాధించేవారు. సేమ్ సీన్ భీమవరంలో కూడా.. ఇక్కడ పవన్ కల్యాణ్ 8వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అక్కడ టీడీపీ అభ్యర్థి రామాంజనేయులుకు 54 వేల ఓట్లు వచ్చాయి. ఇక్కడా అదే పరిస్థితి. ఇక కొన్ని చోట చూస్తే..
* మంగళగిరిలో నారా లోకేష్ ది అదే పరిస్థితి. సుమారు 5200 ఓట్ల తేడాతో లోకేష్ ఓడిపోయారు. ఇక్కడ ముప్పాళ్ల నాగేశ్వరరావు జనసేన బలపర్చిన వామపక్షాల అభ్యర్థి 11 వేల ఓట్లు సాధించారు. ఇక్కడ కూడా జనసేన, టీడీపీ పొత్తు ఉండి ఉంటే లోకేష్ పరాజయం పాలయ్యేవాడు కాదని వాళ్ళ లెక్క..
* విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణు.., టీడీపీ అభ్యర్థి బోండా ఉమాపై కేవలం 25 ఓట్ల తేడాతో గెలిచారు. ఇక్కడ జనసేన అభ్యర్థికి 12 వేల ఓట్లు వచ్చాయి. ఇదే లెక్కలో పొన్నూరు నుండి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన టీడీపీ నేత దూళిపాళ్ళ నరేంద్ర పొన్నూరు నియోజకవర్గంలో 1100 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక్కడ జనసేన తరపున పోటీ చేసిన బోనె పార్వతి 12,500 ఓట్లు వచ్చాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఆళ్ల నాని 4500 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక్కడ జనసేన అభ్యర్థికి 28 వేల ఓట్లు వచ్చాయి.
ఈ లెక్కలను రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 45 నుండి 50 నియోజకవర్గాల్లో ఉదాహరణగా చెప్పుకుంటున్నారు. జనసేన – టీడీపీ విడివిడిగా పోటీ చేస్తే ఒకరి ఒకరు దెబ్బేసుకోవడమే. ఈ పర్యవసానంగా వీరు ఇద్దరూ నష్టపోయి, ప్రత్యర్ధి పార్టీ అంటే వైసీపీ కి లాభం కలుగుతోందని ఇప్పుడిప్పుడే ఒక ఏకాభిప్రాయానికి వస్తున్నట్టు సమాచారం. జనసేన – టీడీపీ కలిసి పోటీ చేస్తే సుమారు 45 నుండి 50 స్థానాలు కచ్చితంగా, ఈజీగా గెలిచే అవకాశాలు ఉంటాయి. అందులో ఉభయ గోదావరి జిల్లాలోనే సుమారు 20 నియోజకవర్గాలు ఉంటాయని లెక్క. ఈ రెండు పార్టీలు కొట్టుకుంటే వచ్చేది ఏమి లేదు అనేది ఇప్పుడు వారికి అర్ధం అయ్యిందట.
సామాజిక లెక్కలు వేస్తున్నారు..!
నిజానికి టీడీపీ ఆవిర్భావం నుండి సంప్రదాయ బీసీ, కాపు ఓటు బ్యాంకులో కొంత టీడీపీతో ఉండేది. 2004 లో వైఎస్ ఆకర్షణలతోనూ.., 2009లో ప్రజారాజ్యం పార్టీ వచ్చిన తరువాత కాపు ఓటు బ్యాంకు కొంత అటు డైవర్ట్ అయ్యింది. ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2019 ఎన్నికల నాటికి కాపు ఓటు బ్యాంకు కొంత వైసీపీకి, కొంత జనసేనకు వచ్చింది. అయితే కాపు సామాజిక వర్గంలో మెజార్టీ వర్గాలు జనసేనను పూర్తి స్థాయిలో నమ్మకపోవడం వల్ల వైసీపీకి మద్దతు ఇచ్చాయి. అదే జనసేన – టీడీపీ కలిసి పోటీ చేసినట్లయితే కాపు ఓటు బ్యాంకు ఎక్కువ శాతం తమ ఓటు వృధా కాదు అన్న భావనతో ఈ రెండు పార్టీల పెద్దలు ఉన్నారు. ఈజీగా 45 నుండి 50 గెలుస్తామని.., గట్టిగా తిరిగి, పొత్తుతో ముందుకు వెళ్లి విస్తృతంగా ప్రచారం చేస్తే మరో 40 – 50 స్థానాలు రాకపోతాయా అనే లెక్కల్లో ఈ పార్టీలున్నాయి. అందుకే వీరు బీజేపీని పక్కన పెట్టేసి ఈ రెండు పార్టీలు కలిసి నడవాలని ఆరు నెలల క్రితమే డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. కాకపోతే ఆ విషయం బయటకు రాలేదు. ఏ పార్టీ, ఎక్కడ అనేది మరో ఆరు నెలల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే “ఆరు నెలల తరువాత ఈ రెండు పార్టీలు ఒక అవగాహనకు అయితే వస్తాయి కానీ తమ మధ్య పొత్తును బయటకు చెప్పే అవకాశం లేదు. ఎన్నికలకు కొన్ని నెలల ముందు పొత్తు ఉన్నట్లు ప్రకటిస్తారు. ఈ లోపు మాత్రం ఎవరికి వారు విడివిడిగానే ప్రజల్లో తిరుగుతారు. ఎవరికి వాళ్లు పాదయాత్రలు, బస్సు యాత్రలు, సైకిల్ యాత్రలు చేస్తారు గానీ పొత్తుల విషయాన్ని ముందే బయటకు చెప్పరు” ఇదీ ఆ పార్టీలు ఉమ్మడి రహస్య ప్రణాళికగా విశ్వసనీయ వర్గాల సమాచారం..!