Uppena Movie : సినిమా లోతులు బయట ఉన్నవారికి కనిపించవు. ఒకసారి ఆ లోతు తెలిస్తే బయటకు రాలేరు..! సినిమా అంటే పిచ్చి, కసి, విపరీత ప్రేమ ఉన్న వారు ఎలాగోలా అక్కడే గడిపేయాలని చూస్తుంటారు..! అటువంటి సినిమాలోకంలో హీరోలతో పాటూ దర్శకులు, నిర్మాతలూ ముఖ్యమే..!! తెరపై కనిపించే హీరోల కంటే తెర వెనుక శ్రమించే దర్శకుడు.., అడిగినవన్నీ సమకూర్చే నిర్మాతలే సినిమాలకు హీరోలు. ఇటువంటి నిర్మాణ రంగంలో తెలుగు సినిమాని ఎదురీదుతూ ఏలుతున్న సంస్థ “మైత్రి” మూవీ మేకర్స్. ఆరేళ్ళ కాలంలో ఆకాశానికి ఎగిరి, పాతాళానికి పడి.. చివరికి సినిమాని ఆకాశానికి తీసుకెళ్తున్న “మైత్రి” వెనుక ఎన్నో కథలు, మరెన్నో ప్రణాళికలు, ఎంతో శ్రమ ఉన్నాయి..!!
Uppena Movie : మూడు హిట్లు.. నాలుగు ఫ్లాపులు..! లాభం స్మాష్..!?
మైత్రి మూవీ మేకర్స్ తెలుగు సినిమాలోకి ప్రవేశమే ఒక భారీ హిట్టు. 2015 లో శ్రీమంతుడు సినిమాతో పరిశ్రమకు నిర్మాతలుగా పరిచయమయ్యారు. మొదటి సినిమాకే భారీ లాభాలు వచ్చి పడ్డాయి. రెండో సినిమా జనతా గ్యారేజ్. ఇది కూడా భారీ హిట్టు. మళ్ళీ లాభాలు. మూడో సినిమా రంగస్థలం. ఇది రికార్డ్ బ్రేక్ హిట్టు. తెలుగు సినీ చరిత్రలో మూడు భారీ హిట్లు అందుకుని “మైత్రి” మూవీ మేకర్స్ పై అందరి కళ్ళు, కుళ్ళు పడేలా మారిపోయారు. వరుసగా ముగ్గురు స్టార్ హీరోలతో మూడు భారీ హిట్లు కొట్టి.. “మైత్రి” బ్రాండ్ చరిత్ర సృష్టించేసారు. కానీ తర్వాత వారికీ అసలైన సవాళ్లు ఎదురయ్యాయి. అసలైన లోతులు తెలిసాయి.
* రంగస్థలం సినిమా వచ్చిన ఆరు నెలల తర్వాత నాగచైతన్య హీరోగా.. మాధవన్ విలన్ గా వచ్చిన “సవ్యసాచి” ఫ్లాప్. మొదటి సరి ఫెయిల్యూర్ చూసారు. పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత వెంటనే మరో రెండు నెలల వ్యవధిలో రవితేజ – శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన
“అమర్ అక్బర్ ఆంటోని” మరో ఫ్లాప్. దీంతో భారీగా నష్టపోయారు. తెలుగు సినీ లోతులు అప్పుడే తెలుసుకున్నారు. మూడు హిట్లు పడినా.., వరుసగా రెండు ఫ్లాపులతో నిర్మాతలుగా సవాళ్లు ఎదుర్కొన్నారు. చిత్రలహరి అనే ఒక చిన్న సినిమా తీసి.. కొంత సేఫ్ అయ్యారు. ఆ వెంటనే మళ్ళీ విజయ్ దేవరకొండ క్రేజ్ ని నమ్మి భారీ బడ్జెట్ తో “డియర్ కామ్రేడ్” తీశారు. దీంతో భారీగా నష్టపోయారు. ఇది పోయిన ఆరు నెలల వ్యవధిలోనే నాని గ్యాంగ్ లీడర్. ఈ సినిమా మంచి టాక్ వచ్చినప్పటికీ బడ్జెట్ ఎక్కువ పెట్టేసి నష్టపోయారు. ఇక మైత్రి పని అయిపొయింది అనుకున్నారు. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం తెచ్చిపెట్టిన లాభాల్లో చాలా భాగం నాలుగు ఫ్లాపులతో ఆవిరైంది. అలా ఏడు సినిమాలతో ఆకాశం.. పాతాళం రెండూ చూసారు.
తెరపైన, తెర వెనుక మిత్రులెందరో.. అందుకే “మైత్రి”..!!
మైత్రి మూవీ మేకర్స్ అంటే ముగ్గురు. యలమంచిలి రవి శంకర్, యెర్నేని నవీన్, మోహన్ కనిపిస్తారు. ఒకరు సాఫ్ట్ వెర్.. మరో ఇద్దరు డిస్ట్రిబ్యూటర్లు.. కానీ ఈ ముగ్గురు వెనుక కొందరు మిత్రులున్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ సహా ఇతర మిత్రుల ద్వారా ఈ బ్యానర్ ని నడుపుతున్నారు. అందుకే నష్టాలు వచ్చిన సమయంలో మిత్రుల సాయంతో మళ్ళీ పైకి లేచి.. సినిమాపై మోజు, కసి, ప్రేమతో సినిమా స్థాయిని పెంచుతున్నారు.
* నాని గ్యాంగ్ లీడర్ తో నష్టపోయిన తర్వాత కొన్నాళ్ళు గ్యాప్ తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఉప్పెనతో మైత్రి రాబోతుంది. తర్వాత కూడా వరుసగా పెద్ద సినిమాలే ఉన్నాయి. అల్లు అర్జున్ – సుకుమార్ ల పుష్ప.., మహేష్ బాబు – పరశురామ్ ల సర్కారువారిపాట.., బాలీవుడ్ లో సల్మాన్ తో ఒక సినిమా.., విజయ్ దేవరకొండ – సందీప్ వంగతో కలిసి మరో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఇలా తెలుగు సినిమాలో లోతులను తెలుసుకుని.. సినిమా స్థాయిని పెంచేలా “మైత్రి” సినిమాతో మైత్రి చేస్తుంది..!!