Adipurush: రామాయణం నేపథ్యంలో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన “ఆదిపురుష్” జూన్ 16వ తారీకు విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ కావటం జరిగాయి. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేమికులు ఎంతగానో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు భాషకు సంబంధించి ప్రీ రిలీజ్ వేడుక మంగళవారం తిరుపతిలో లక్షలాది మంది అభిమానుల మధ్య చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన చిన్న జీయర్ స్వామి మాట్లాడుతూ…”సినిమా రంగంలో చరిత్ర సృష్టించిన మహనీయులు ఉండే ఇలాంటి కార్యక్రమంలో మాలాంటి వారు పాల్గొనటం ఇది మొదటిసారి.
దానికి ప్రధానమైన కారణం నిజమైన బాహుబలి శ్రీరాముడిని లోకానికి నిరూపించడం కోసం అని అనుకోవాలి. ప్రతి వ్యక్తిలోనూ ప్రతి గుండెలోను రాముడన్నాడు. ఆ రాముడిని బయటకు తీసుకుని రావడానికి, ప్రభాస్ తనలోని రాముడిని పైకి తీసుకుని వస్తున్నారు. మానవజాతి మనుగడ మార్గాన్ని చూపించింది శ్రీరాముడే. ఆయన ఈ మట్టి పై నడిచిన మహా పురుషుడు. మానవజాతికి ఆధారమైన వాడు. ప్రజలను ధర్మ మార్గంలో నడిపించడానికి రాముడు మానవుడయ్యాడు. రామాయణంలో “అరణ్యకాండ”…. “యుద్ధకాండ” లోని ప్రధానమైన కథను చరిత్రగా లోకానికి అందించాలని తపనతో ఈ సినిమా చేసినట్టు తెలియజేశారు.
ఇంతకంటే ఈ లోకానికి మహోపకారం మరొకటి ఉండదు. రామాయణం గురించి చెప్పే సినిమాలు ఇంతకుముందు చాలానే వచ్చాయి. కానీ అప్పటి తరం వేరు ఇప్పటి తరం వేరు. అయితే ఈ తరానికి అర్థమయ్యే రీతిలో టెక్నాలజీని జోడించి… ప్రపంచం ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి ప్రయత్నం చేసిన ఈ సినిమా యూనిట్ మొత్తానికి మంగళ శాసనాలు చేస్తున్నాము అంటూ.. చిన్న జీయర్ స్వామి ఆశీస్సులు అందించారు.