వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తన `లక్ష్మీస్ ఎన్టీఆర్`తో మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఏదైనా మొహమాటం లేకుండా ముఖం మీద చెప్పే రాంగోపాల్ వర్మ దివంగత నేత ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో చివరి రోజుల్లో జరిగిన పరిణామాల గురించే తన సినిమా ఉంటుందని.. ముందు తాను లక్ష్మీస్ ఎన్టీఆర్ను తెరకెక్కించాలనుకోలేదని.. బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ను తెరకెక్కించాలని మాట్లాడినప్పుడే తనకు ఆ ఆలోచన వచ్చిందని తెలిపారు. కాబట్టి తన `లక్ష్మీస్ ఎన్టీఆర్` చిత్రాన్ని బాలకృష్ణకు అంకితం చేస్తానని చెప్పారు. ఈ సినిమా ఎన్నికల సందర్భంలో వస్తుంది కదా! ఏ పార్టీ గెలుస్తుందని మీరు నమ్ముతున్నారని విలేఖరులు ప్రశ్నిస్తే.. నేను భవిష్యత్ చెప్పడానికి జ్యోతిష్కుడిని కానని అన్నారు. వర్మ. అయితే మీరు ఎవరిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారని అడిగితే… జనసేన అధినేత పవన్కల్యాణ్ లేదా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్ అని చెప్పాడు.
పవన్ కల్యాణ్ గురించి చదవాలంటే సినిమా పేజీ వరకు వెళ్లాల్సి ఉంటుంది. అదే ఆయన ముఖ్యమంత్రి అయితే ముందు పేజీలోనే ఆయన గురించి చదువుకోవచ్చు. ఆయన ఫోటోను ముందు పేజీలోనే చూడొచ్చు. అలాగే కె.ఎ.పాల్ ముఖ్యమంత్రి అయితే ప్రతి రోజూ కామెడీని ఎంజాయ్ చేయవచ్చు అన్నారు వర్మ. అంతే కాకుండా తన జీవితంలో పాల్లాగా అబద్ధాలు చెప్పే వ్యక్తిని చూడలేదని కూడా చెప్పడం కొసమెరుపు.
`లక్ష్మీస్ ఎన్టీఆర్` చేయడం వల్ల తనకు చంద్రబాబు వల్ల నష్టం కానీ.. జగన్ వల్ల లాభం కానీ లేదని చెప్పారు. ఈ సినిమా తీయడం వల్ల నిజాలు ఏవైనా బయటపడతాయేమోనని భయపడుతన్నారని, అందువల్ల రక రకాల ఒత్తిళ్లు తెచ్చారు. అవన్నీ చిన్నపిల్లల చేష్టలులాగా అనిపించాయి. తన సినిమాను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరుండి విడుదల చేయిస్తారని భావిస్తున్నట్లు కూడా తెలిపారు. తదుపరి కె.సి.ఆర్ బయోపిక్ తీయాలనుకుంటున్నట్లు కూడా తెలిపారు.