Jamili Elections: జమిలి ఎన్నికలపై చర్చ మన రాష్ట్రంలో గానీ దేశంలో గానీ కొత్త ఏమీ కాదు. ఇదిగో 2023లో జమిలీ ఎన్నికలు వచ్చేస్తాయి.. లేదు లేదు 2022 చివరలోనే ఎన్నికలు వచ్చేస్తాయి.. అదుగో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిన్న స్పీచ్ లో చెప్పారు.., మొన్న అమిత్ షా చెప్పారు.. అదిగదిగో మొన్ననే వెంకయ్య నాయుడు నోటి వెంట కూడా జమిలి మాట వచ్చింది అంటూ చాలా పుకార్లు, ప్రచారం జరుగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు ఐడిని ఆధార్ తో లింక్ చేస్తే అదుగో జమిలీ ఎన్నికల కోసమే అంటూ ప్రచారం. నరేంద్ర మోడీ జమిలి అన్న పదం వాడితే అదిగో జమిలీ ఎన్నికలు అంటూ ప్రచారం చేస్తున్నారు.
జమిలి ఎన్నికలు నిర్వహించడం అంత సులువా.. ప్రధాన మంత్రి మోడీ అనుకుంటేనో, అమిత్ షా అనుకుంటేనో జమిలి ఎన్నికలు నిర్వహించడం అంత ఈజీ కాదు. మన దేశంలో రాజ్యాంగబద్దంగా ఉన్న అన్ని వ్యవస్థలు సిద్ధం అవ్వాలి. న్యాయపరమైన చిక్కులు రాకుండా చూసుకోవాలి. ఒక వేళ వచ్చినా సుప్రీం కోర్టు ఆమోదం తెలపాలి. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం తెలిపిన వెంటనే అభ్యంతరాలు లేకుండా ఆమోదించడానికి రాష్ట్రపతి సిద్ధంగా ఉండాలి. దానికి సంబంధించి అభ్యంతరాలు ఏమైనా ఉంటే వివిధ రాష్ట్రాల నుండి తీర్మానాలు తెప్పించుకోవాలి.
జమిలి ఎన్నికల గురించి ఇప్పుడు చర్చ ఎందుకంటే..? తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశంలో జమిలీ ఎన్నికలు రావాల్సి ఉందనీ, ఒకే దేశం – ఒకే ఎన్నిక జరగాల్సి ఉందని అని అన్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా మాట్లాడుతూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జమిలి ఎన్నికల గురించి మోడీ మాట్లాడటం కొత్త కాదు. 2012లో. 2014లో, 2017లో జమిలీ అంటూ మాట్లాడారు. ఇప్పుడు 2022 లోనూ జమిలీ అంటూ మాట్లాడుతున్నారు. 2023 గానీ 2024 లో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఏమైనా ఉందా.. ? అంటే లేదు. ఎందుకంటే.. జమిలి ఎన్నికలు అంటే దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఒకే సారి పార్లమెంట్ ఎన్నికలు జరగాలి. అదే సమయంలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాలి. ఒక్కో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి, ఆ తరువాత పార్లమెంట్ ఎన్నికలు జరగడం గందరగోళం అవుతుంది.
Jamili Elections: ఆ అసెంబ్లీలు పొడిగిస్తారా..!?
సంవత్సరం మొత్తం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ఎన్నిక జరగడం వల్ల వ్యయం ఎక్కువ అవుతోంది, శ్రమ ఎక్కువైపోతుంది అన్న వాదన ఉంది. 2023, 2024, 2026 వరకూ జమిలీ సాధ్యం కాదని విశ్లేషకలు అభిప్రాయంగా ఉంది. 2023లో జమిలీ ఎన్నికలు నిర్వహించాలి అనుకున్నప్పుటు యూపీతో సహా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరిలో జరిపేందుకు ఈసీ చర్యలు తీసుకునేది కాదు. ఒక వేళ 2023 జమిలి ఎన్నికలు అంటే ఎన్నికైన ఆ అయిదు రాష్ట్రాల ప్రభుత్వాలను ఏడాదిలో రద్దు చేస్తారా..? అంటే చేయరు కదా..! ఒక వేళ జమిలి ఎన్నికలు పెట్టాలని భావిస్తే యూపీ, పంజాబ్, గోవా, మేఖాలయ, ఉత్తరాఖండ్ ఎన్నికలు జరిగేవి కావు. ఆయా రాష్ట్రాలకు ఏడాది పాటు రాష్ట్రపతి పాలన పెట్టాల్సి ఉండేది. లేదా ఆ ప్రభుత్వాలనే ఏడాదో రెండేళ్లో పొడిగించాలి. 2025లో జమిలి ఎన్నికలు నిర్వహించాలని అనుకున్నప్పుడు 2024లో ఏపి ఎన్నికలు నిర్వహించకూడదు. ఇదే ప్రభుత్వాన్ని ఏడాది పాటు కొనసాగించాలి. ఒక వేళ 2029 లో జమిలీ ఎన్నికలకు పోవాలంటే ఇప్పుడు జరుగనున్న అయి రాష్ట్రాల పదవీ కాలం అయిదేళ్లు 2027కు పూర్తి అవుతున్నందున ఈ రాష్ట్రాల పదవీ కాలాన్ని మరో రెండేళ్లు పొడిగించాల్సి ఉంటుంది.
2029 వరకు సాధ్యం కాకపోవచ్చు..!?
జమిలీ ఎన్నికలు నిర్వహించాలి అంటే పలు రాష్ట్రాల పదవీ కాలాన్ని కుదించాలి. మరి కొన్ని రాష్ట్రాల పదవీ కాలాన్ని పెంచాల్సి ఉంటుంది. దీనికి ఆయా రాష్ట్రాల తీర్మానాలు తప్పనిసరి. దేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాలు ఉంటే కనీసం 20 రాష్ట్రాల నుండి మేము జమిలికి సిద్దమేనంటూ తీర్మానాలు వెళ్లాలి. ఆ తరువాత పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలి, లా కమిషన్ కు పంపించాలి. అభ్యంతరాలు లేవని చెప్పాలి. అప్పుడు రాజ్యసభ ఆమోదించాలి. అవసరమైన రాజ్యాంగ సవరణలు చేసి రాష్ట్రపతి ఆమోదం కొరకు పంపాలి. రాష్ట్రాలకు సంబంధం లేకపోతే కేంద్రం తలుచుకుంటే ఎప్పుడైనా పెట్టేయవచ్చు కానీ దీనికి రాష్ట్రాల సమ్మతి తప్పనిసరి. ఇవన్నీ పరిశీలిస్తే జమిలి ఎన్నికలు 2029 వరకూ సాధ్యం కాదు అని చెప్పవచ్చు..!