మన హిందూ ధర్మం లో ఉండే ఆచారాలలో చాల ఆరోగ్యం దాగి ఉంది అనడంలో సందేహం లేదు. శాస్త్రమేగా అని కొట్టి పారేయకండి అందులో కావలిసినంత సైన్సు కూడావుంది.
మనం పండగలు, శుభకార్యాలు జరుపుకునేటప్పుడు గుమ్మానికి మామిడి ఆకుల తో చేసిన తోరణాలు కడతాం. మామిడి ఆకులు కోసిన తర్వాత కొన్ని గంటల పాటుకూడా ఆక్సిజన్ అందచేస్తాయట. ఇంటికి ఎక్కువమంది వచ్చినప్పుడు వాళ్లకి ఆక్సిజన్ సరిగ్గా అందడానికి మామిడాకులు కడతాము. పూర్వం నేల మీద కూర్చుని భోజనం చేసే వారట. నేల మీద కూర్చొని తింటే మనకు ఎంత ఆకలిగా ఉంటే అంత భోజనం మాత్రమే తినడంతో ఊబకాయానికి అవకాశం ఉండదు.కూర్చునే పద్ధతి వల్ల తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. ఇప్పుడు కూడా చాలా మంది ఈ పద్ధతిని పాటిస్తున్నారు.
పసుపులో యాంటి బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అందుకే క్రిములు ఇంట్లోకి ప్రవేశించకుండా పసుపును గడపలకి రాస్తారు. అంతేకాకుండా శరీరంపై ఉన్న బ్యాక్టీరియా పోవడానికి పసుపు ను వాడతారు .తులసి పూజ చేయడం కూడా ఎన్నో తరాల నుండి ఆనవాయితీగా వస్తోంది. తులసి పూజ చేసిన తర్వాత స్వీకరించే తులసి ఆకుల తీర్థం లో క్యాన్సర్ వంటి వ్యాధులను అరికట్టే గుణాలు ఉంటాయని వైద్యశాస్త్రం చెబుతుంది.
వేప పుల్లలతో పళ్ళు తోముకోవడం వల్ల దంతాలు బలంగా ఉండడంతో పాటు గొంతు కూడా బాగుంటుందట. పొద్దున్నే వేప చెట్ల నుండి వచ్చే గాలి పీలిస్తే శ్వాస సంబంధిత సమస్యలు కూడా రావు .మన భోజనంలో ఉండే క్రిములను, విషాన్ని, ఇంకా శరీరానికి హాని కలిగించే పదార్థాలని గ్రహించే శక్తి అరిటాకు కి ఉంది . అందుకే చాలామంది అరిటాకులో భోజనం చేయమని చెప్తారు .