శ్రీలంక లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. అధ్యక్ష, ప్రధాని పదవుల నుండి గొటబాయ రాజపక్స , రణిల్ విక్రమ్ సింఘే లు తప్పుకోవాలని డిామండ్ చేస్తూ ప్రజలు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇప్పటికే నిరసన కారులు అధ్యక్ష, ప్రదాని నివాసాల్లో తిష్టవేశారు. ప్రజాగ్రహం నేపథ్యంలో రాజీనామా చేయకుండానే దేశం దాటిన అధ్యక్షుడు గొటబాయ రాజపక్స నిన్న ఉదయం మాల్దీవులకు చేరుకున్న సంగతి తెలిసిందే. మాల్దీవుల్లోనూ శ్రీలంక జాతీయులు గో బ్యాగ్ గొటబాయ అంటూ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
దీంతో మల్దీవుల్లోనూ ఉండటం కూడా సేఫ్ కాదనుకున్న గొటబాయ ఈ రోజు సౌదీ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంలో సింగపూర్ బయలు దేరారు. ఈ విషయాన్ని శ్రీలంక మీడియా సంస్థలు వెల్లడించాయి. ఆ తరువాత సింగపూర్ నుండి సౌదీ అరేబియాకు గొటబాయ రాజపక్స చేరుకోనున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తొలుత దేశం దాటనిస్తేనే అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని గొటబాయ మెలిక పెట్టి సురక్షితంగా తను అనుకున్న గమ్యస్థానంకు చేరిన తరువాత పదవిని వీడనున్నారని తెలుస్తొంది.
కాగా గొటబాయ రాజపక్స దేశం విడిచి వెళ్లిన తరువాత తాత్కాలిక అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన ప్రధాని రణిల్ విక్రమ్ సింఘే దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. మరో పక్క రణిల్ విక్రమ్ సింఘే అధ్యక్ష బాధ్యతలు చేపట్టడాన్ని అక్కడి ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. పార్లమెంట్ స్వీకర్ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు చేపట్టి స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభించాలని కోరుతున్నాయి. ఆందోళనకారుల నుండి రాష్ట్రపతి, ప్రధాని నివాసాలను స్వాధీనం చేసుకోవాలని రణిల్ విక్రమ్ సింఘే నిన్న బలగాలను ఆదేశించారు. ఈ క్రమంలోనే నిరసన కారుల నుండి కూడా ప్రకటన విడుదలైంది. భవనాలను ఖాళీ చేసేందుకు సిద్దమేననీ, తమ పోరాటాన్ని మాత్రం కొనసాగిస్తామని నిరసన కారులు వెల్లడించారు. మరో పక్క శ్రీలంక ప్రభుత్వం కొలంబోలో కర్ఫ్యూ విధించింది. ఈ రోజు మద్యాహ్నం 12 గంటల నుండి రేపు ఉదయం 5 గంటల వరకూ కర్ప్యూ కొనసాగుతుందని తెలిపింది.
భార్యతో సహా దేశం విడిచి పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స