ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రముఖ వ్యాపారి అమిత్ ఆరోరాను ఇవేళ ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అమిత్ అరోరాను సీబీఐ ప్రత్యేక కోర్టుకు హజరుపర్చిన ఈడీ అధికారులు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను బయటపెట్టింది. ఈ స్కామ్ లో రూ.100 కోట్ల ముడుపులు సౌత్ గ్రూప్ చెల్లించిందనీ, సౌత్ గ్రూపునకు శరత్ చంద్రారెడ్డి, కల్వకుంట్ల కవిత, మాగుంట నియంత్రించారని ఈ డీ పేర్కొంది. సౌత్ గ్రూప్ ద్వారా వంద కోట్ల రూపాయలను విజయ్ నాయర్ కు చేర్చినట్లు ఈడీ వెల్లడించింది.
ఈ కేసులో అనుమానితులు 36 మంది ఆధారాలను రూపుమాపడం కోసం రూ.1.38 కోట్ల విలువైన 170 సెల్ ఫోన్లు ధ్వంసం చేశారని ఆరోపించింది. వీటిలో కవిత రెండు నెంబర్ లను పది మొబైల్ పోన్ లలో వాడినట్లుగా ఈడీ పేర్కొంది. కవిత వాడిన పది ఫోన్ల ఆధారాలు దొరక్కుండా ధ్వంసం చేసారని పేర్కొంది. కవిత ద్వంసం చేసిన ఫోన్ లు, వాటి ఈఎంఐఏ నెంబర్లను, ఫోన్లు వాడిని తేదీలను అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించింది ఈడీ. ఫోన్ లు మార్చిన వారిలో శరత్ చంద్రారెడ్డి, బుచ్చిరెడ్డి, అభిషేక్ బోయినపల్లి, సృజన్ రెడ్డి తదితరులు ఉన్నారని తెలిపింది. దర్యాప్తులో ఇచ్చిన వాంగ్మూలంలో అమిత్ అరోరా దృవీకరించారని ఈడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖుల పేర్లు వెలుగుచూస్తుండటం, వారి సన్నిహితులు కార్యాలయాలు, ఇళ్లల్లో ఇప్పటికే సోదాలు జరగడం చర్చనీయాంశం అవుతోంది.
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో ప్రముఖ వ్యక్తి అరెస్టు