PM CARES Fund: కరోనా నివారణపై గతంలో అనేక సంచలన వ్యాఖ్యలు, వివాదాస్పద చర్యలు చేసిన మధ్యప్రదేశ్ సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ఉషా ఠాకూర్ తాజాగా వ్యాక్సిన్ వేయించుకున్న వారు పిఎం కేర్స్ కు విరాళం ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఉచితంగా వ్యాక్సిన్ సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతంగా జరుగుతోంది. వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థల నుండి డోస్ రూ.250ల చొప్పున కేంద్రం కొనుగోలు చేసి రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నది.
అయితే వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్న తరువాత పీఎం కేర్స్ ఫండ్ కు రూ.500లు విరాళం ఇవ్వండి అంటూ మంత్రి ఉషా ఠాకూర్ విజ్ఞప్తి చేయడం సంచలనంగా మారింది. రెండు డోసులు వేసుకున్న తర్వాత కొద్ది మొత్తం రూ.500 ఇవ్వడం పెద్ద కష్టమేమి కాదని అంటున్నారు. రీసెంట్ గా ఆమె మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ మహామ్మారి దృష్యా వ్యాక్సినేషన్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. అందుకే చేతులు జోడించి అడుగుతున్నా. దేవుడు దయ వల్ల ఇవ్వగలిగిన వాళ్లంతా రూ.500 ను పీఎం కేర్స్ ఫండ్ కు విరాళంగా ఇవ్వండి. ఇది నా రిక్వెస్ట్ అని అన్నారు. ఒక్కో డోసుకు అయ్యే ఖర్చు రూ.250లు అని మనందరికీ తెలుసు. అలా రెండు డోసులు ఉచితంగా తీసుకుంటే రూ.500లు ఫండ్ రూపంలో ఇవ్వండి, ఇది నా రిక్వెస్ట్ మత్రమే అని చెప్పుకొచ్చారు.
దేశ వ్యాప్తంగా ఉచితంగా వ్యాక్సిన్లు పంపిణీ చేస్తున్నందున బీజేపీ నేతలు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని అభినందనలు తెలియజేస్తున్న క్రమంలో మంత్రి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. మంత్రి వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తప్పుబడుతున్నారు.
ఉషా ఠాకూర్ గతంలో కోవిడ్ రక్షణకు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదంటూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరోనా నివారణకు యజ్ఞాలు, హిందూ వేద పద్ధతులను అవలంబించాలని పిలుపునివ్వడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ తరువాత ఇండోర్ విమానాశ్రయంలో వైరస్ విముక్తి కోసం అంటూ దేవి అహిల్య భాయి హోల్కర్ కు ప్రత్యేక పూజలు నిర్వహించి కీర్తనలు పాడుతూ, భజన కూడా చేశారు.