Election Commission : ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా సార్వత్రిక ఎన్నికల్లో 70 నుండి 85 శాతం మాత్రమే పోలింగ్ జరుగుతోంది. వివిధ రకాల కారణాలతో పది నుండి 20 శాతం మంది, పలు ప్రాంతాల్లో 30 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్నారు. వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు నిర్వహించుకునే వారికి సొంత గ్రామాల్లో ఓటు ఉండటం, వివిధ పనుల వల్ల వేరే ప్రాంతాల్లో ఉండటం తదితర కారణాల వల్ల ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఓటింగ్ శాతం ఇంకా పెరిగిేందుకు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలని ఎన్నికల సంఘం భావిస్తున్నది. ఓ పక్క ఓటరు గుర్తింపు కార్డుకు ఆధార్ అనుసంధానం చేయడానికి ప్రయత్నాలు చేయాలని ఈసీ ఒక నిర్ణయానికి వచ్చింది. ఆదే విధంగా ఓటింగ్ విధానంలో నూతన విధానానికి శ్రీకారం చుట్టాలని ప్రయత్నాలు చేస్తున్నది.
ఈ క్రమంలో భాగంగా రిమోట్ ఓటింగ్ విధానం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నది. వచ్చే లోక్ సభ ఎన్నికల నాటికి రిమోట్ ఓటింగ్ విధానం అమలులోకి వస్తుందన్న అశాభావాన్ని ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా వ్యక్తం చేశారు. శనివారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రిమోట్ ఓటింగ్ విధానంపై ఈ ఏడాదే పరిశోధన ప్రారంభించామని చెప్పారు. వివిధ ఐఐటీలు, ఇతర సాంకేతిక నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. రెండు మూడు నెలల్లో పైలట్ ప్రాజెక్టును ప్రారంభిస్తామని అరోరా వెల్లడించారు. మరో పక్క ప్రవాస భారతీయులు ఈ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం పై కేంద్ర న్యాయ శాఖకు ఈసీ ప్రతిపాదనలు పంపింది. ఓటరు కార్డును ఆధార్ తో అనుసంధానం చేసే విషయాన్ని కేంద్రం పరిశీలన చేస్తున్నది. ఇది గనుక జరిగితే బోగస్ ఓట్లు తొలగింపు సాధ్యపడుతుంది.
రిమోట్ ఓటింగ్ విధానం వస్తే ఓటర్లు ఎక్కడి నుంచైనా ఓటేసే సౌకర్యం ఏర్పడుతుంది. అయితే గత ఎన్నికల సమయంలో దాదాపు 18 రాజకీయ పార్టీలు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలంటూ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. పలు అనుమానాలతో ఈవిఎం ద్వారా ఓటింగ్ ను పలు రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. రాజకీయ పార్టీల అనుమానాలను ఈసీ కొట్టిపారేసింది. ఇప్పుడు తాజాగా రిమోట్ ఓటింగ్ విధానాన్ని ఈసీ తీసుకురానున్న నేపథ్యంలో విపక్షాలు దీనిపై ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి.